ఆమనగల్లు: రిజర్వేషన్ల పరిరక్షణకు బహుజనులంతా ఏకం కావాలని బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా.బొల్లు మహేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞన కేంద్రంలో ఈనెల 26న రిజర్వేషన్డే సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం రిజర్వేషన్డే సభ కరపత్రాలను వివిధ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో బీసీ కులాల విముక్తి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, దళిత, క్రైస్తవుల సమస్యలపై చర్చించడం జరుగుతుందని చెప్పారు. సభకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేశ్ భీమపాక ముఖ్య అతిథిగా, సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ప్రత్యేక ఆహ్వానితులుగా, తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ తదితరులు హాజరవుతారని వివరించారు. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణుచారి, బీఎస్పీ నాయకుడు వెంకటయ్య, వివిధ సంఘాల నాయకులు శ్రీనివాస్, సాగర్, రాజేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సోదరుల మాతృమూర్తి పట్నం రుక్కమ్మ (95) శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె 7.45 గంటలకు చనిపోయారు. శనివారం మధ్యాహ్నం వీరి స్వగ్రామమైన షాబాద్ మండలం గొల్లూరుగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
షాద్నగర్: ఎంతో కాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న షాద్నగర్ చౌరస్తా విస్తరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ సరిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 27 నుంచి ఆక్రమణ తొలగింపు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, ఆర్ఆండ్బీ, ట్రాన్స్కో, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


