న్యూస్రీల్
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026
జిల్లాలో ఆశించిన దానికంటే తక్కువ మ్యాపింగ్ నమోదవుతుండటంపై ఇటు ఎన్నికల అధికారుల్లోనే కాదు అటు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల్లోనూ అలజడి మొదలైంది. మెజార్టీ ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల మ్యాపింగ్పై దృష్టిపెట్టాల్సిందిగా ఆయా పార్టీల పోలింగ్ ఏజెంట్లకు రాష్ట్ర, జిల్లా ఎన్నికల కమిషన్ పదేపదే సూచిస్తోంది. ఈ మేరకు వారికి శిక్షణ కూడా ఇచ్చింది. బీజేపీ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ పార్టీ ఓటు బ్యాంకు అనుకున్న ప్రతి ఒక్క ఓటును డిజిటలైజేషన్ చేయిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కొంత వరకు ఓటర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. పది రోజుల పాటు అన్ని పనులు మానుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఎమ్మెల్సీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ ఏజెంట్లు పెద్దగా శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది.
అర్బన్లో భారీగా తగ్గనున్న ఓట్లు
జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 36,99,743 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఇప్పటి వరకు 21,34,632 మంది ఓట్లు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయ్యాయి. మరో 13,34,277 ఓట్ల ప్రక్రియ పెండింగ్లో ఉంది. 2,30,834 మంది ఓటర్లు ఇప్పటి వరకు తమ ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బీఎల్ఓలకు ఇవ్వలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 83.84 శాతం పూర్తయింది. ఎల్బీనగర్లో అత్యల్పంగా 45.95 శాతం మాత్రమే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఉన్న మెజార్టీ ఓటర్లు సొంతూళ్లపై మక్కువ చూపుతుండటమే ఇందుకు కారణమని సమాచారం. గతంలో రెండు చోట్ల ఓటు వేశారు. ప్రస్తుతం ఏదో ఒక చోట మాత్రమే ఓటు హక్కు పొందే అవకాశం ఉండటంతో మెజార్టీ ఓటర్లు సొంతూళ్లను ఎంచుకుంటున్నారు. ఎల్బీనగర్ సహా శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ వంటి అర్బన్ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. మహేశ్వరంలో అత్యధికంగా 45,821 మంది, రాజేంద్రనగర్లో 30,676, శేరిలింగంపల్లిలో 32,083, చేవెళ్లలో 31,466, ఇబ్రహీంపట్నంలో 27,150, ఎల్బీనగర్లో 31,764 మంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది.
జిల్లాలో మందకొడిగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ
మెజార్టీ ఓటర్లకు ఇప్పటికీ చేరని ఎన్యూమరేషన్ ఫారాలు
తీసుకున్న వారు తిరిగివ్వడంలోనూ తాత్సారం
ఇప్పటి వరకు 57.70 శాతం డిజిటలైజేషన్ పూర్తి
మిగిలింది పది రోజులు మాత్రమే..
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) గడువు మరో పది రోజుల్లో ముగియనుంది. మెజార్టీ ఓటర్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ ఫారాలు చేరకపోగా తీసుకున్న వారు తిరిగి వాటిని బీఎల్ఓలకు అందజేయడంలో అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో ఇప్పటి వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ 57.70 శాతం మించలేదు.
– సాక్షి, రంగారెడ్డి జిల్లా


