హుడాకాంప్లెక్స్: రాష్ట్రంలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో (హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) 2025–26 విద్యా సంవత్సరానికి గాను నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన, క్రీడాధికారి స్వర్ణలత పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ.. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు మండల విద్యాధికారి ఆధ్వర్యంలో మండల స్థాయి ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు మాత్రమే జిల్లా స్థాయికి అర్హులన్నారు. మార్చి 28 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను రాష్ట్రస్థాయికి పంపిస్తారన్నారు. 8 నుంచి 9 సంవత్సరాల మధ్య (01.09.2017 నుంచి 31.08.2018 మధ్య జన్మించి ఉండాలి) వయస్సు ఉండాలన్నారు. ఈనెల 4వ తేదీ వరకు tgss.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఇతర వివరాలకు మండల విద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.
షాద్నగర్రూరల్: ఉద్యోగులు మానసిక ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని షాద్నగర్ డిపో మేనేజర్ ఉష అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో మంగళవారం జాతీయ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని జయంచడం ఎలా అన్న అంశంపై డాక్టర్ మహేశ్తో అవగాహన కల్పించారు. అనంతరం డీఎం మాట్లాడుతూ.. మానసిక ఆందోళనతో విధులను సక్రమంగా నిర్వర్తించలేమనే విషయాన్ని ఉద్యోగులు గ్రహించాలని అన్నారు. ప్రతిఒక్కరూ క్రమం తప్పకుండా 30 నిమిషాల పాటు వ్యాయామంచేస్తే మానసిక ఆందోళన తగ్గుతుందన్నారు. చిన్నపాటి సమస్యలకు కుంగిపోవద్దని, ఆనందంగా ఉండాలని సూచించారు. ఉద్యోగులు విధులకు హాజరయ్యే ముందు ఇంటి నుంచి ప్రశాంతంగా రావాలన్నారు. సమయానికి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సుధాకర్, మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ నాగులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: కార్గోలో వచ్చిన పార్సిల్ సామగ్రిని ఈనెల 7న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నం బస్టాండ్లో వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. కార్గో బస్సుల్లో రవాణా చేసిన పలు పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు కొన్నాళ్లుగా తీసుకెళ్లడం లేదన్నారు. ఈ సామగ్రిని వేలం వేయనున్నామని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనా లని సూచించారు.


