షాద్నగర్రూరల్: విద్యార్థులంతా కలిసి హోలీ సంబరాలు చేసుకున్నారు.. స్నానం చేసేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు.. చెరువులోకి దిగిన వారిలో ఓ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు.. గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు.. ఈ ఘటన ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామశివారులో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఫరూఖ్నగర్ మండలం రాయికల్ శివారులోని ఓ భవనంలో నారాయణపేట, నాగర్కర్నూల్, దేవరకద్రకు చెందిన మహాత్మాజ్యోతిరావుపూలే డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఈ కళాశాలలో జోగులాంబ గద్వాలజిల్లా, ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు (19) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాలలో విద్యార్థులు హోలీ వేడుకలను జరుపుకొన్నారు. మధ్యాహ్నం దాదాపు ఆరుగురు విద్యార్థులు రాయికల్ సమీపంలోని చెరువు వద్దకు స్నానానికి వెళ్లారు. ఈత రాకపోవడంతో చెరువులోకి దిగిన రాజు గల్లంతయ్యాడు. విషయాన్ని తోటి విద్యార్థులు కళాశాల అధ్యాపకులకు చెప్పడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయాన్ని తెలుసుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కిషన్ ఆధ్వర్యంలో ఫైర్ అధికారులు రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెరువులో గురుకుల విద్యార్థి గల్లంతు


