పురపోరులో ధన ప్రవాహం
● ఓటు వేయడానికి వెళ్లే వరకు నగదు పంపిణీ చేసిన అభ్యర్థులు
● ఒక్కరోజే సుమారు రూ.వంద కోట్లు పంపిణీ!
మొయినాబాద్: మున్సిపల్ ఎన్నికలు ‘మనీ’పోల్స్గా మారాయి. ఎన్నికల్లో చివరి వరకు డబ్బుల వరద పారింది. ఓటు వేయడానికి వెళ్లే చివరిక్షణం వరకు ఓటర్లకు అభ్యర్థులు డబ్బుల పంపిణీ చేశారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు సుమారు రూ.వంద కోట్ల నగదు పంపిణీ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా డబ్బులు పంచారు. వారం రోజులుగా పంపిణీ చేసిన వస్తువులకు అదనంగా చివరి రోజు డబ్బుల పంపిణీ జరిగింది. అభ్యర్థులు ఒకరికంటే ఒకరు ఎక్కువ డబ్బులు ఇస్తూ కొందరికి రెండు సార్లు సార్లు డబ్బులు ముట్టజెప్పారు. కొందరు అభ్యర్థులు మంగళవారం రాత్రి డబ్బులు పంచి మళ్లీ బుధవారం ఉదయం ఓటు వేయడానికి వెళ్లే ముందు ఇళ్లలోకి వెళ్లి నగదు ఇచ్చారు. ప్రతి ఇంటికి రూ.లక్షల్లో డబ్బు చేరింది.
డబ్బులతో తారుమారు
మున్సిపల్ ఎన్నికల్లో ధన ప్రభావం అభ్యర్థుల భవితవ్యం తారుమారు చేసే పరిస్థితి నెలకొంది. అభ్యర్థులంతా తగ్గేదేలే అన్నట్లుగా నగదు పంచారు. డబ్బులు తీసుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎవరి ఓట్లు ఎవరికి మారుతాయో.. ధన ప్రభావం ఎవరికి కలిసొస్తుందోనని అభ్యర్థుల్లోనూ గుబులు పుట్టుకుంది.


