కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీ
● సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కవిత
● నేటి దేశ వ్యాప్త సమ్మెను
జయప్రదం చేయాలని పిలుపు
కడ్తాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కవిత డిమాండ్ చేశారు. అందుకు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈనెల 12 నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి జీపు జాతను బుధవారం మండల కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాల రాసిందన్నారు. వీటి స్థానంలో నాలుగు కోడ్లను తీసుకొచ్చిందన్నారు. అవి పెట్టుబడిదారి వ్యవస్థకు అనుకూలంగా, కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా రూపొందించారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాన్ని రూపు మాపి, 12 గంటలకు పెంచుతున్నారన్నారు. తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాఽధి హామీ స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉప సంహరించుకోవాలన్నారు. సమ్మెకు కార్మికులందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, ఆశావర్కర్స్ మండల అధ్యక్షులు జ్యోతి, ప్రధాన కార్యదర్శి లావణ్య, కోశాధికారి సబిత, వివిధ సంఘాల నాయకులు అభి, శేఖర్, బాలు, జంగయ్య, రమేశ్, బుజ్జమ్మ పాల్గొన్నారు.


