
మా వారిని విడుదల చేయించండి
పంజగుట్ట: క్షణికావేశంలో నేరాలకు పాల్పడి ఏళ్ల తరబడి జీవిత ఖైదు అనుభవిస్తున్న తమ వారిని క్షమాభిక్ష ప్రసాదించి జైలు జీవితం నుంచి విముక్తి కలిగించాలని జీవిత ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖైదీల కుటుంబ సభ్యులు స్వప్న, బీచుపల్లి షరీఫ్, రాజేష్, అనీల్ కుమార్ మాట్లాడుతూ .. క్షణికావేశంలో చేసిన నేరాలతో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న వారి పరిస్థితి ఒకలా ఉంటే వారిపై ఆధారపడ్డ వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. భర్త దూరమై ఒకరు, తండ్రి దూరమైన పిల్లలు, సోదరుడు దూరమై, వృద్ధాప్యంలో ఉన్న వారు కొడుకులను దూరమై నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతాధృక్పథంతో స్పందించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తమ వారికి క్షమాభిక్ష ప్రసాదించి సాధారణ జీవితాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సెంట్రల్ లైటింగ్ పోల్ మీదపడి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
మల్లాపూర్: విద్యుత్ సెంట్రల్ లైటింగ్ పోల్ మీద పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ రుద్వీర్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున స్థానిక వీఎస్టీ కాలనీకి చెందిన భజరంగ్ యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. అదే సమయంలో కార్తీకేయనగర్కు చెందిన స్వాథిక్ (23) బైక్ ఆ మార్గంలో వెళుతున్నాడు. మార్గమధ్యలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో వినాయకుడిని తరలిస్తున్న లారీ రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభానికి కట్టిన కేబుల్ వైర్ను తాకింది. దీంతో రెండు స్తంభాలు విరిగిపోయాయి, ఒక స్తంభం గణేష్ విగ్రహంపై పడగా, మరో స్తంభం విరిగి సాథ్వీక్ తలపై పడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. వాహనం డ్రైవర్ ఏడుకొండలు, భజరంగ్ యూత్ ఆసోసియేషన్ ఆర్గనైజర్ వెంకటేష్పై పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
వినాయక చవితికి వచ్చి అనంతలోకాలకు..
స్వాథిక్ పూణేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నాచారం వచ్చిన అతను బెంగళూరు నుంచి వచ్చిన తన స్నేహితుడి కలిసేందుకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మృత్యువాత పడ్డాడు.
రైలుకిందపడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
సికింద్రాబాద్: రైలుకిందపడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రైల్వే సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డేవిడ్రాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ఉదయం చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని మహబూబ్నగర్ జిల్లా, నెల్లికుదురుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బూక్యా పట్నాయక్ (28) గా గుర్తించారు. నెల్లికుదురు గ్రామానికి చెందిన రైతు బూక్యా బాలాజీ కుమారుడు పట్నాయక్ నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూ చెంగిచెర్లలోని తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు. మృతుడి వద్ద అభించిన సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మా వారిని విడుదల చేయించండి

మా వారిని విడుదల చేయించండి