
‘ఈ’ కుప్పలు!
ప్రజారోగ్యంపై ప్రభావం..
రాష్ట్రంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు
సాక్షి, సిటీబ్యూరో: సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. అంతకు రెట్టింపు వేగంతో ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు (ఈ–వేస్ట్) విడుదల అవుతున్నాయి. సెల్ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటర్, ఏసీ, ప్రింటర్లు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తి వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారుతున్నాయి. తెలంగాణలో తొలిసారిగా ఈ–వేస్ట్ లక్ష మెట్రిక్ టన్నుల మార్క్ను దాటింది. 2024–25లో 1,19,187 మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ విడుదలయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అదే 2023–24లో 65,226 మెట్రిక్ టన్నుల ఈ–వేస్ట్ విడుదలైంది. అంటే ఏడాది కాలంలో రాష్ట్రంలో అదనంగా 53,961 మెట్రిక్ టన్నులు ఈ–వ్యర్థాలు విడుదలయ్యాయి.
● దేశంలో ఉత్తరప్రదేశ్, హరియాణా తర్వాత దేశంలో అత్యధిక ఈ–వ్యర్థాలు విడుదలవుతున్నది మన రాష్ట్రంలోనే. తెలంగాణలో అధికంగా ఈ–వేస్ట్ విడులయ్యేది హైదరాబాద్ నుంచే. గత ఐదేళ్లలో నగరంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017–18లో నగరంలో 33,425 మెట్రిక్ టన్నుల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి కాగా.. ఇప్పుడవి 50,835 మెట్రిక్ టన్నులకు పెరిగాయి.
ఈ–వేస్ట్ ప్రాసెసింగ్..
దేశంలో ఈ–వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం 13.97 మెట్రిక్ టన్నులు కాగా.. ఇందులో తెలంగాణ వాటా 8.5 శాతం. ప్రాసెసింగ్ వృద్ధిలో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. 2021–22 నుంచి ఈ–వేస్ట్ ప్రాసెసింగ్ మూడు రెట్లు వృద్ధి చెందుతోంది. ఐటీ సంస్థల కార్యకలాపాలు, పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం, చురుకై న ఈ–వేస్ట్ నిర్వహణ విధానాలు ప్రాసెసింగ్ వృద్ధికి ప్రధాన కారణాలు. 2021–22లో 42,297 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెసింగ్ కాగా.. గత ఆర్థిక సంవత్సరానికి 1.19 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అయితే రాష్ట్రంలో కేవలం 15 రీసైక్లింగ్ కేంద్రాలే ఉన్నప్పటికీ.. ప్రాసెసింగ్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం గమనార్హం.
తొలిసారిగా లక్ష మెట్రిక్ టన్నులు దాటిన ఈ–వేస్ట్
2024–25లో 1,19,187 మెట్రిక్ టన్నుల విడుదల
ఉత్తర్ప్రదేశ్, హర్యానా తర్వాత అత్యధికంగా మన రాష్ట్రంలోనే..
రాష్ట్రంలో కేవలం 15 రీసైక్లింగ్ కేంద్రాలే
పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఈ–వ్యర్థాలు ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపిస్తుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో సీసం, పాదరసం, కాడ్మియం, క్రోమియం వంటి రసాయన పదార్థాలు ఉంటాయి. వీటిని సరిగా నిర్వీర్యం చేయకుండా పారేస్తే.. గాలి, నీరు, నేల కలుషితం అవుతాయి. ఈ కలుషితాలతో శ్వాసకోశ వ్యాధులు, నాడీ సంబంధిత రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులపై ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంద ని వారు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా, కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.