
హత్య కేసు.. కొత్తమలుపు!
నిందితుల కోసం
గాలింపు..
● రెండో భర్తతో కలిసి మొదటి భర్తను హత్య చేసిన మహిళ
● నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు
మొయినాబాద్: అజీజ్నగర్ డెయిరీ ఫామ్లో జరిగిన హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఫామ్లో పనిచేయడానికి వచ్చిన మహిళ తన మొదటి భర్తతో కలిసి రెండో భర్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న సామ రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పని చేసే రాజేశ్కుమార్(24) శనివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. నిందితులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అన్ని విషయాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
నెల రోజుల క్రితమే..
అజీజ్నగర్లోని రాజిరెడ్డి డెయిరీ ఫామ్లో పనిచేసేందుకు బిహార్కు చెందిన ఏజెంట్ పవన్ ద్వారా నెల రోజుల క్రితం రాజేశ్కుమార్, పూనం దేవి దంపతులు వచ్చారు. అయితే తన మొదటి భర్త మహేశ్సాని అలియాస్ గుడ్డును వదిలేసిన పూనందేవి.. రాజేశ్కుమార్ను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రాజేశ్కుమార్, పూనందేవి అజీజ్నగర్లోని డెయిరీ ఫామ్లో పనిచేస్తున్నారు. ఇటీవల రాజేశ్కుమార్ మద్యం తాగి తనను వేధిస్తున్నాడని పూనందేవి తన మొదటి భర్త మహేశ్సానీకి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఈనెల 21న మహేశ్సాని అజీజ్నగర్ వచ్చాడు. అతను తమ బంధువని భర్తకు పరిచయం చేసింది. అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి రాజేశ్కుమార్ను హత్య చేసి, పారిపోయారు.
హత్య కేసు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఏజెంట్ పవన్తో ఫోన్లో మాట్లాడి పరారైన నిందితుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వద్ద హత్యకు గురైన రాజేశ్కుమార్ వివరాలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. నిందితులు మహేశ్సాని, పూనందేవిల వివరాలు తనకు తెలియదని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వీరు బిహార్ వెళ్లారా..? మరెక్కడైనా ఉన్నారా..? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు దొరికితేనే కేసు విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు.