
బ్యాలెట్ పేపర్లు రెడీ
కార్యదర్శులపై నిఘా
రద్దు చేయాలి కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు రెడీగా ఉన్నాం. ఇప్పటికే పది లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించాం. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు తెప్పించి సర్వం సిద్ధం చేశాం. జిల్లా వ్యాప్తంగా 526 పంచాయతీలు ఉండగా, వీటి పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. ప్రతి 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ చొప్పున జిల్లా వ్యాప్తంగా 4,682 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం’ అని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే..
ఓటర్ల జాబితా సిద్ధం
2018తో పోలిస్తే ప్రస్తుతం పంచాయతీల సంఖ్య కొంత తగ్గింది. గతంలో 558 పంచాయతీలు ఉండగా, కొత్తగా చేవెళ్ల, మెయినాబాద్ మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం.. ఔటర్కు సమీపంలో ఉన్న పలు పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో కలపడంతో 526కు తగ్గింది. ఆయా గ్రామాల పరిధిలో మొత్తం 7,94,653 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,99,404 మంది పురుషులు, 3,95,216 మంది మహిళలు, 33 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా సిద్ధం చేసి ఉంచాం.
ఆ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి
2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థలకు పాలక మండళ్లు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా నిలిచిపోయాయి. వీధిలైట్లు, ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులు, మంచినీటి మోటార్ రిపేర్ల కోసం నిధుల సమస్య తలెత్తుతోంది. కొన్ని సందర్భాల్లో కార్యదర్శులే సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.104.54 కోట్లు రాగా, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.4.75 కోట్లు వచ్చాయి. 75 శాతానికి కంటే తక్కువ ఆస్తిపన్ను వసూలైన పంచాయతీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. నిర్దేశించిన లక్ష్యం మేరకు పన్నులు వసూలయ్యేలా చేసి, సమస్యలు తలెత్తకుండా చూస్తున్నాం.
‘స్థానిక’ ఎన్నికలు
ఎప్పుడు వచ్చినా సిద్ధం
గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బ్యాలెట్ బాక్సులు
జిల్లాలో 526 జీపీలు, 4,668 వార్డులు, 4,682 పోలింగ్ స్టేషన్లు
‘సాక్షి’తో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్
తరచూ విధులకు గైర్హజరయ్యే పంచాయతీ కార్యదర్శులపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ఇప్పటికే కచ్చితమైన హాజరు కోసం జీపీఎస్ ఆన్లైన్ అటెండెన్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చాం. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఫేక్ అటెండెన్స్కు చెక్ పెడుతున్నాం. ఆమనగల్లు మండలం సింగంపల్లి కార్యదర్శి జంగయ్య సహా ఫరూఖ్నగర్ మండలం బీమారం పంచాయతీ కార్యదర్శి అనిల్కుమార్పై ఫేక్ అటెండెన్స్ వ్యవహారంలో సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవలే ఓ కార్యదర్శికి ఒక రోజు సర్వీసు కట్ చేశాం. ఏసీబీకి చిక్కినట్టే చిక్కి, విధులకు ఎగనామం పెడుతున్న మరో కార్యదర్శిపై కూడా వేటు పడింది. వారం రోజుల వ్యవధిలోనే ఐదుగురు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మరో 15 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశాం. ప్రభుత్వం త్వరలో బయోమెట్రిక్, ఫేస్రీడింగ్, ఐనిస్ అటెండెన్స్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది.
సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నాం
జిల్లా వాప్తంగా 3,016 మంది పారిశుద్ధ్య కార్మికులు, 61 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పని చేస్తున్నారు. నిజానికి వీరికి పంచాయతీల బడ్జెట్ నుంచి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో వారి వేతనాలను 18 నెలల నుంచి ప్రభుత్వమే స్వయంగా చెల్లిస్తోంది. ఒక్కో పారిశుద్ధ్య కార్మికుడిని నెలకు సగటున రూ.9,500 చొప్పున, డేటా ఎంట్రీ ఆపరేటర్కు రూ.19,500 చొప్పున చెల్లిస్తున్నాం. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి రూ.7.20 కోట్లు ఇటీవలే చెల్లించాం. ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలోనే అవి కూడా చెల్లిస్తాం.

బ్యాలెట్ పేపర్లు రెడీ