
రేపటి నుంచి ఫీవర్ సర్వే
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతో పాటు సోమవారం నుంచి ఇంటింటికీ జ్వరాల సర్వే నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.వెంకటేశ్వరరావు సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆశాలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికీ తిరిగి జ్వర పీడితులను గుర్తించాలని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామాల్లో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు.
సమన్వయంతో పని చేయాలి
వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఎంహెచ్ఓ సూచించారు. ముందు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంల సమన్వయంతో పంచాయతీ, మల్టీపర్పస్ సిబ్బందితో గ్రామంలో అవసరమైన పారిశుద్ధ్య పనులకు చర్యలు చేపట్టాలన్నారు. దోమల ద్వారా డెంగీ, చికున్ గున్యా మలేరియా లాంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్ని హ్యాబిటేషన్లలో ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వర్షాలకు డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా శుభ్రం చేయించాలన్నారు. వర్షం నీరు నిలువ ఉంచకుండా ముందుకు ప్రవహించేలా డ్రైన్లను శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ షికాహయత్, డాక్టర్ విజయ పూర్ణిమ, జల్లా మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు