
తప్పిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యుల చెంతకు
యాచారం: తప్పిపోయిన విద్యార్థిని యాచా రం పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలు... కందుకూరు మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మనిచరణ్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆరో తరగతి చదువుతున్నాడు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి శుక్రవారం ఉదయం యాచారం ఆర్టీసీ బస్టాండ్లో వేచి ఉన్నాడు. గమనించిన యాచారం పోలీసులు ప్రశ్నించగా సరిగా వివరాలు చెప్పలేదు. వసతి గృహంలో చదువుకుంటున్నానని చెప్పడంతో వసతి గృహం ఇన్చార్జితో పాటు తల్లితండ్రులకు సమాచారం అందించారు. నిర్ధారణ చేసుకున్నాక విద్యార్థి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వనస్థలిపురం: వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రూ.70 వేలు లంచం తీసుకుంటున్న సబ్ రిజస్ట్రార్ ఎస్.రాజేష్కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. తుర్కయాంజాల్ పరిధిలోని 200 గజాల స్థల విషయం వివాదాస్పదంగా మారింది. దీని రిజిస్ట్రేషన్కు సబ్రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితుడు రూ.70 వేలు ఇస్తానన్నాడు. ఈ మేరకు శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ తన సహాయకుడు, డాక్యుమెంట్ రైటర్ వద్ద టైపిస్ట్గా పని చేసే రమేష్ ద్వారా రూ.70 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. కార్యాలయంలో జరిగే అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
రాజేంద్రనగర్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మామిడి కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీరయ్య(26), శ్రావణిలు బుద్వేల్ ప్రాంతంలో నివాసముంటున్నారు. బీరయ్య కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాడు. శుక్రవారం ఇంట్లో భార్య శ్రావణి వంట చేస్తుండగా గ్యాస్ అయిపోయింది. దీంతో బీరయ్య ఇదే ప్రాంతంలో ఉంటున్న అత్తగారింటికి వెళ్లి అన్నం అక్కడే వండుకొని రమ్మని భార్యకు తెలిపాడు. దీంతో భార్య తల్లిగారింటికి వెళ్లింది. అనంతరం బీరయ్య ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకున్నాడు. భోజనానికి వస్తానని చెప్పిన భర్త ఇంకా రాకపోవడంతో శ్రావణి ఇంటి వద్దకు వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంతకూ తెరవకపోవడంతో స్థానికుల సహయంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరేసుకొని ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచమానా నిర్వహించి ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.