
సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు
యాచారం: సీసీ కెమెరాలుంటే పోలీస్ నిఘా ఉన్నట్లేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని తక్కళ్లపల్లిలో గురువారం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు బిగించుకోవాలని సూచించారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, యువకులు సమష్టిగా డబ్బులు జమ చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు జరిగిప్పుడు సులభంగా నేరస్తులను గుర్తించే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాలుంటే నేరాలు, చోరీలు తగ్గుముఖం పడుతాయన్నారు. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీలు, మరో 20కి పైగా అనుబంధ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతల సహకారం కోరనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధు, గ్రామస్తులు శ్రీశైలం, సంతోష, మల్లేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
అప్పు ఇచ్చిన మహిళ కిడ్నాప్
● కారులో తీసుకెళ్తుండగా.. మరో కారును ఢీకొన్న వైనం
● మహిళతో పాటు ఇద్దరికి గాయాలు
శంషాబాద్ రూరల్: రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం ఘటన మహిళ కిడ్నాప్ కథగా మారింది. శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చేవెళ్ల మండలం, ఆలూరు వాసి కొండకల్ల పద్మజ అదే గ్రామానికి చెందిన కమ్మెట విజయ్గౌడ్కు రూ.నాలుగు లక్షలు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తిరిగి ఇచ్చే విషయమై వారి మధ్య గొడవ జరిగింది. దీంతో విజయ్గౌడ్ ఆమైపె కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పద్మజ భర్త బుచ్చయ్యను చికిత్స నిమిత్తం మల్కారంలోని ఆశాజ్యోతి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 5న భర్తకు దుస్తులు ఇచ్చేందుకు వచ్చిన పద్మజను గుర్తించిన విజయ్గౌడ్, వెంకటేష్, సాయితో కలిసి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. కారు కొత్వాల్గూడ శివారులో ఔటర్ సర్వీసు రోడ్డులో వెళ్తుండగా.. అదుపుతప్పి ఎదురుగా వచ్చిన బీఎండబ్ల్యూ కారును ఢీకొంది. ఈ ఘటనలో పద్మజ, విజయ్గౌడ్, సాయికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి. బీఎండబ్ల్యూ కారులో ఉన్న వారు ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఎర్టిగా కారులో ఉన్న పద్మజను విచారించగా.. తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపింది. దీంతో శంషాబాద్ పోలీసులు గురువారం ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..
యువకుడిపై హత్యాయత్నం
బంజారాహిల్స్: తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి దారికాచి ఆమె ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆసిఫ్నగర్కు చెందిన షేక్ ఆదిల్ టెంట్హౌస్లో పని చేసేవాడు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10సీ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్న బోయిన్పల్లికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజూ ఆదిల్ ఆమెను ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో బైక్పై ఎక్కించుకుని బోయిన్పల్లిలో ఇంటి సమీపంలో వదిలేసేవాడు. బుధవారం రాత్రి ఆదిల్ ఆమెను బైక్ ఎక్కించుకుని జూబ్లీహిల్స్ చెక్పోస్టు మీదుగా వెళ్తుండగా అప్పటికే పథకం ప్రకారం చెక్పోస్టు సమీపంలో దారికాచిన ఆమె భర్త అంజద్ వీరిని అడ్డగించాడు. అందరూ చూస్తుండగానే ఆదిల్ తలపై బండరాయితో మోది అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆదిల్ను స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్
అనంతగిరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ సూచించారు. గురువారం వికారాబాద్లోని సంగం లక్ష్మీబాయి రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన ట్రైనీ కలెక్టర్ హర్షచౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు విద్యా బోధన ఎలా చెబుతున్నారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పరిశుభ్రమైన తాగునీటిని వాడాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.