
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
అబ్దుల్లాపూర్మెట్: జనగాంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7 నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి 4వ జాతీయ జావెలిన్ డే వేడుకలు, కిడ్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్నకు మండల విద్యార్థులు ఎంపికయ్యారు. బాటసింగారం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు మల్యాల యాదగిరి తెలిపారు. ఈ నెల 5న సరూర్నగర్లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాల తరఫున పాల్గొన్న కొడిశెల విలాస్, గాండ్ల ఈశ్వరిలు ప్రతిభ చాటారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు వారు ఎంపిక కావడంతో బుధవారం ఇద్దరికి క్రీడా దుస్తులను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వాణిశ్రీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
కాడెద్దు మృతి
కేశంపేట: విద్యుదాఘాతంలో కాడెద్దు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామశివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి ఎదిరె ఆంజనేయులు తన వ్యవసాయ పొలంలోని పశువుల పాకలో రోజు మాదిరిగా తన పశువులను కట్టేశాడు. రాత్రి సమయంలో కాడెద్దు తాడును తెంపుకొని బయటకు వచ్చింది. సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ భూమికి తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదవశాత్తు వైర్లు తగిలి విద్యుత్ షాక్తో ఎద్దు మృతి చెందింది. కాడెద్దు విలువ సుమారు రూ.1.10 లక్షలు ఉంటుందని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
ఖాతా డబ్బులు
అడిగినందుకు కత్తితో దాడి
కేపీహెచ్బీకాలనీ: కిరాణా షాపు ఖాతా డబ్బులు ఇవ్వకపోగా..నిర్వాహకురాలిపై దాడి చేసి కత్తితో దాడి చేసిన సంఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లోని ఎల్ఐజి 143లో మణిమాల కుటుంబం నివాసం ఉంటుంది. ఈమె స్ధానికంగా కిరాణా షాపు నిర్వహిస్తుంది. ఇదే కాలనీలోని ఎల్ఐజి 183లో నివాసం ఉండే రాజేష్రెడ్డి కిరాణా షాపులో కిరాణా సామాగ్రి కొనుగోలు చేస్తుంటాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో రాజేష్ రెడ్డి డబ్బులు ఖాతా పెట్టి కిరాణా సామాగ్రి తీసుకునేవాడు. అయితే నాలుగు నెలలు గడుస్తున్నా ఖాతా డబ్బులు ఇవ్వలేదు. దీంతో డబ్బులు ఇవ్వాలని ఆమె ఒత్తిడి చేయగా..బుధవారం మధ్యాహ్నం మణిమాల ఇంటికి వెళ్లిన రాజేష్రెడ్డి ఆమైపె అకస్మాత్తుగా దాడి చేశాడు. గొంతు నులిమి పక్కనే ఉన్న కత్తితో గొంతు కోసేందుకు యత్నించాడు. తీవ్రమైన పెనుగులాటలో మణిమాల గొంతుపై కత్తి కోసుకుపోగా, రాజేష్ రెడ్డి చేతికి కూడా గాయాలయ్యాయి. మణిమాల గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించి 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కింద పడిపోయిన రాజేష్రెడ్డిని కూడా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణిమాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేష్రెడ్డి ప్రవర్తన ఇటీవల కాలంలో విచిత్రంగా ఉందని, ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు మద్యానికి అలవాటు పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక