
పేదల అభ్యున్నతే లక్ష్యం
బడంగ్పేట్: పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బాలాపూర్ మండలం మల్లాపూర్లోని వైఏఆర్ గార్డెన్లో మంగళవారం చేపట్టిన రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 12 వేల కొత్త రేషన్కార్డుల జారీతో సగటున 50 వేల మందికి సన్నరకం బియ్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు తీసుకువస్తున్నామని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయమని పేర్కొన్నారు. రాష్ట్ర వాప్తంగా ఇప్పటి వరకు 65 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు రేషన్కార్డులు అందించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే సబితారెడ్డి, టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, కందుకూరు ఆర్డీవో రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ మేయర్ చిగురింత పారిజాత తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీగా నినాదాలు
రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎమ్మెల్యే సబితారెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. 2 గంటల సమయంలో మంత్రి అక్కడికి చేరుకోగానే బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా సబితమ్మ జిందాబాద్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. అంతే రెట్టింపుతో కాంగ్రెస్ నాయకులు సైతం నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సబితారెడ్డి మైక్ తీసుకుని ప్రొటోకాల్ పాటించకుండా ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. మీరుమీరే పంపిణీ చేసుకుంటే మేమెందుకు ఇక్కడ అంటూ బహిష్కరించి వెళ్లబోయారు. మీరు వెళ్లొద్దంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెను కోరారు. అదేసమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. ఏసీపీ జానకిరాం ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం సబితారెడ్డి అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించారు. రేషన్కార్డులు అందుకోవాలని చంటి బిడ్డలతో వచ్చి న తల్లులు ఏంజరుగుతుందో అర్థంకాక విస్తుపోయి చూశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు

పేదల అభ్యున్నతే లక్ష్యం