
రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
వ్యాధి తగ్గడం లేదని మనస్తాపం
షాద్నగర్ రూరల్: వ్యాధి తగ్గడం లేదని మనస్తాపానికి గురైన ఓ వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని కేశంపేట రైల్వేగేట్ సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బల్లేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా, పూడూరు మండలం కంకల్కు చెందిన పిచ్చకుంట్ల కిష్టయ్య(80) కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగా పట్టణంలోని రతన్కాలనీలో అద్దెకు ఉంటున్నారు. కిష్టయ్య చాన్నాళ్లుగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తగ్గకపోవడం, వృద్ధాప్య సమస్యలు చుట్టముట్టడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఉదయాన్నే గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన రైల్వే పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం బాడీని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
నేడే ఆఖరు
షాద్నగర్ రూరల్: మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ దుకాణాల సముదాయంలోని షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మంగళవారం ముగియనుందని ఎంపీ డీఓ బన్సీలాల్ అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 1–ఏ, 13–ఏ, 16– ఏ, 17–ఏ నంబర్ దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు సీల్డ్ టెండర్ల ద్వారా వేలం నిర్వహించి, షాపులను కేటాయిస్తామన్నారు. ఇందులో పాల్గొనే వారు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఎంపీడీఓ, ఎంపీపీ ఫరూఖ్నగర్ పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ చెల్లించి దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బుధవారం ఆఫీసులో సీల్డ్ టెండర్లను తెరిచి, దుకాణాలను కేటాయించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వేధింపుల భర్తపై
కేసు నమోదు
మొయినాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్తపై మొయినాబాద్ పీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపల్లి గ్రామానికి చెందిన చీపిరి రాజుకు 2012లో నాగిరెడ్డిగూడకు చెందిన సరితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సరితకు మరో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. సోదరులు లేకపోవడంతో పుట్టింటి నుంచి భూమి, ఇల్లు ఇప్పించాలని రాజు కొన్నేళ్లుగా భార్యను వేధిస్తున్నాడు. అతని బాధ భరించలేక కొంత కాలం క్రితం 6 గంటల భూమి ఇచ్చారు. అయినా ఇల్లు కావాలంటూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో గత ఆదివారం సరిత పుట్టింటికి వెళ్లిపోయింది. రాత్రి అక్కడికి చేరుకున్న రాజు భార్యపై దాడిచేశాడు. దీంతో సోమవారం ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భవిత సెంటర్లో ఫిజియోథెరపీ
ఎంఈఓ చంద్రప్ప
బంట్వారం: వారానికోసారి నిర్వహించే ఫిజి యోథెరపీకి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను తల్లిదండ్రులు తప్పక తీసుకురావాలని కోట్పల్లి ఎంఈఓ చంద్రప్ప అన్నారు. సోమవారం భవిత సెంటర్లో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు డాక్టర్ శ్రీకాంత్ ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. సుమారు 20 మందికి పైగా పిల్లలకు ఫిజియోథెరపీ చేయించామన్నారు. వీరికి ప్రతిరోజు తరగతులు ఉంటాయన్నారు. వారానికోసారి ఫిజియోథెరపీ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమం తప్పకుండా భవిత కేంద్రానికి తీసుకురావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ స్పెషల్ ఎడ్యుకేటర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్, ఐఈఆర్పీ దిలీప్కుమార్, సీఆర్పీ నర్సింలు పాల్గొన్నారు.

రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య

రైలు కింద పడి వృద్ధుడి ఆత్మహత్య