
ఫ్యూచర్ జీపీల్లో.. అభివృద్ధి మంత్రం!
యాచారం: మండలానికి టీజీఐఐసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఫార్మాసిటీ కోసం అత్యధికంగా భూములిచ్చిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను రూ.19 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. దీంతో పాటు మండలంలోని మిగిలిన 20 గ్రామాల్లోనూ అవసరమైన అభివృద్ధి పనులకు ఫండ్స్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పైన పేర్కొన్న నాలుగు గ్రామాల్లోని తొమ్మిది వేల ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేస్తూ దీని స్థానంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది నమ్మని స్థానిక రైతులు పట్టా భూములను ఇచ్చేది లేదని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనంలో విశ్వాసం కలిగేలా గ్రామాల్లో అభివృద్ధి పనులకు టీజీఐఐసీ సిద్ధమైంది.
ప్రతిపాదనల తయారీ
యాచారం మండలంలోని 20 గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను టీజీఐఐసీ నుంచి మంజూరు చేయించే విషయంలో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. ఆయా జీపీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, పంచాయతీ, కమ్యూనిటీ భవనాలు, అసంపూర్తిగా అంగన్వాడీ, పాఠశాల, మండల, జిల్లా పరిషత్, ఆస్పత్రి తదితర భవనాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ డీఈఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ఏ పనులు పెండింగ్ ఉన్నాయో చెప్పాలంటూ ఆ శాఖ అధికారులు నాయకులకు ఫోన్లు చేస్తున్నారు.
నమ్మకం కలిగేలా..
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 19,333 ఎకరాలు కావాలని భావించిన గత ప్రభుత్వం తొమ్మిది వేల ఎకరాలకు పైగా సేకరించింది. ఇందులో యాచారం మండలంలోని నాలుగు గ్రామాల నుంచే ఎక్కువ భూమిని తీసుకున్నారు. నష్టపోయింది కూడా ఇక్కడి రైతులే. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని సింహభాగం ఆ నాలుగు గ్రామాల్లోనే నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేస్తే బాగుంటుందని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితం మొండిగౌరెల్లిలోని 820 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. బాధిత రైతులకు న్యాయబద్ధమైన పరిహారం అందించడంతో పాటు అభివృద్ధి కనిపించేలా చేస్తే వ్యతిరేకత ఉండదనేది టీజీఐఐసీ యోచనగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేజర్ గ్రామాలైన యాచారం, చింతపట్ల, గునుగల్, మాల్, నందివనపర్తి, చింతుల్ల, మంతన్గౌరెల్లి, కొత్తపల్లి తదితర జీపీల్లోనూ పలు అభివృద్ధి పనులకు బీజం పడనుంది.
ఫోన్లు చేసి అడుగుతున్నాం
యాచారం మండలంలోని 20 గ్రామాల్లో ఏయే అభివృద్ధి పనులు కావాలో గుర్తించి వివరాలు పంపాలని మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలకు సూచిస్తున్నాం. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. నాలుగు రోజులుగా ఇదే పనిలో బిజీగా ఉన్నాం.
– శ్రీనివాస్, పీఆర్ డీఈఈ
రూ.30 కోట్లకు పైగా నిధులు
మండలంలోని 20 గ్రామాల్లో అవసరమై న అభివృద్ధి పనులకు రూ. 30 కోట్లకు పైగా టీజీఐఐసీ నిధులు ఖర్చు చేయనున్నాం. ప్రపోజల్స్ పంపిన వెంటనే ఫండ్స్ రిలీజ్ చేస్తామని టీజీఐఐసీ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. యాచారంతో పాటు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
– మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం
యాచారం మండంలోని అన్ని గ్రామాలపైనా టీజీఐఐసీ నజర్
రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం
అవసరమైన పనులకు ప్రతిపాదనలు పంపాలని సూచన
వెంటనే నిధులు మంజూరు చేస్తామని హామీ
ప్రపోజల్స్ రూపకల్పనలో అధికారులు బిజీ

ఫ్యూచర్ జీపీల్లో.. అభివృద్ధి మంత్రం!

ఫ్యూచర్ జీపీల్లో.. అభివృద్ధి మంత్రం!