అల్లర్లు చేస్తే అరెస్టే..!
ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనుల్లో పోలీసులు దూకుడు పెంచారు. పను లకు ఆటంకం కలిగిస్తున్నవారిపై కన్నెర్ర చేస్తున్నారు. అల్లర్లు చేస్తే అరెస్టు చేస్తామని హెచ్చ రిస్తున్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
యాచారం: ఫార్మాసిటీ భూముల వ్యవహారం హాట్టాఫిక్గా మారింది. సేకరించిన భూముల సర్వే, ఫెన్సింగ్ పనుల్లో బాధితులతో పాటు.. పరిహారం పొందిన వారు కూడా తరచూ పనులు అడ్డుకుంటుండంతో సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం, పోలీసులకు ఫుల్ పవర్ ఇచ్చింది. దీంతో పనులకు ఎలాంటి అడ్డంకి కలిగినా క్షణాల్లో వాలిపోతున్నారు. పది రోజుల క్రితం నక్కర్తమేడిపల్లి గ్రామం నుంచి ఫార్మా భూముల సర్వే, ఫెన్సింగ్ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచి భూములు సేకరించిన రెవెన్యూ శాఖ, డబ్బులు ఇచ్చిన టీజీఐఐసీ కంటే పోలీస్ శాఖనే అప్రమత్తంగా ఉంది. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు బందోబస్తును ఏర్పాటు చేస్తుండగా, సమన్వయ బాధ్యతలను గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు పర్యవేక్షిస్తున్నారు.
పోలీసు పహారాలో..
భూముల సర్వే, ఫెన్సింగ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా.. డీసీపీ పర్యవేక్షణలో అడిషనల్ డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, మరో వంద మందికి పైగా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. భూములు సేకరించిన నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లోని రోడ్లపై చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. భూసేకరణలో నిజంగానే రైతులకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే.. వారి సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, కోర్టు కేసులున్న భూముల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటెలిజెన్సి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.
సీఎంఓ నుంచి పర్యవేక్షణ
ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో ఫ్యూచర్(ఫోర్త్)సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే గత ప్రభుత్వం సేకరించిన 14 వేల ఎకరాల భూమికి పక్కగా సర్వే చేసి, ఫెన్సింగ్ పనులు చేపట్టింది. పలు ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించడానికి నిర్ణయించినకాంగ్రెస్ సర్కార్.. రైతులు, ప్రజల నుంచి ఏ సమస్య రాకుండా సీఎంఓ కార్యాలయం నుంచి నిత్యం పర్యవేక్షిస్తోంది. పోలీస్, రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులకు సలహాలు, సూచనలు చేస్తోంది. నెల రోజుల్లో సర్వే, ఫెన్సింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. కొన్ని నిర్మాణ సంస్థలకు కావాల్సిన భూమిని అప్పగించి, మే నెల చివరి వారంలో సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వేగంగా ఫార్మాసిటీ భూముల సర్వే
ఫెన్సింగ్ పనుల్లో పోలీసుల దూకుడు
ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్న వైనం
పరిహారం ఇప్పిస్తామంటూ అధికారుల భరోసా
మే నెలలో భూములను పరిశీలించనున్న సీఎం
బాధితులకు భరోసా
భూ సేకరణలో చాలా మందికి పరిహారం అందలేదని, నకిలీ పత్రాలతో కొందరు రూ.కోట్లు దండుకున్నారని పేర్కొంటూ పలువురు రైతులు సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటున్నారు. ఏళ్లుగా కబ్జాలో ఉన్న తమకు అన్యాయం జరిగిందని ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు.. రెవెన్యూ, టీజీఐఐసీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. పల్లెచల్కతండాలో 20మందికి పైగా గిరిజనులు, కుర్మిద్దలో పదిమందికి పైగా పేదలు, నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి గ్రామాల్లో మరో 40 మంది.. హక్కుదారులమైన మాకు పరిహారం ఇవ్వకుండా, దళారులకు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. ఇదే అంశాన్ని ఏసీపీ కేపీవీ రాజు.. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి దృష్టికితీసుకెళ్లారు. ఆ భూములను పరిశీలించేలా చేశారు. దీంతో భరోసా కలిగిన రైతులు.. సర్వే, ఫెన్సింగ్ పనులకు సహకరిస్తున్నారు.
అల్లర్లు చేస్తే అరెస్టే..!
అల్లర్లు చేస్తే అరెస్టే..!


