‘ఎర్లీ’గా కట్టేయండి..
షాద్నగర్: కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూలుపై మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముందస్తుగా ఆస్తి పన్ను వసూలు చేసేందుకు ఎర్లీ బర్డ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా రాయితీని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పన్నుదారులకు ఊరట
అస్తి పన్ను క్రమం తప్పకుండా చెల్లించే వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ఊరట కల్పిస్తోంది. ఈనెల 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆస్తి పన్ను మదింపు డిమాండ్ ఇంటి నంబర్ల వారీగా మున్సిపల్ వెబ్సైట్లో వచ్చేసింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి అంటే మార్చి 2026 వరకు పన్ను మొత్తం చెల్లిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బకాయిలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు బలవంతం చేసే అవకాశం ఉండదు.
ఈనెల 30 వరకే అవకాశం
పన్ను రాయితీ ఐదు శాతం కేవలం రాబోయే సంవత్సరానికి ముందుగా చెల్లించిన దానికి మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 30వ తేదీలోపు చెల్లించే వారికే ఈ అవకాశం ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఎర్లీ బర్డ్ పథకం కింద పన్నులు స్వీకరిస్తున్నారు. ఐదుశాతం రాయితీని సద్వినియోగం చేసుకొని ముందస్తుగా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించే వారిని అధికారులు సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
వీరే అర్హులు
2024– 25 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ పథకానికి అర్హులు. రాయితీ పొందాలనుకునే వారు గతేడాది తమ ఆస్తి పన్నును పూర్తిగా చెల్లించి ఈ ఏడాదికి సంబంధించి ముందస్తుగా చెల్లించినా రాయితీ ఇవ్వనున్నారు.
నిధుల సమీకరణ కోసం
మున్సిపాలిటీలకు సాధారణ నిధి కింద వచ్చే నల్లా పన్నులతో పాటు దుకాణాల అద్దె, వర్తక పన్ను, వాణిజ్య ప్రకటనలపై వచ్చే ఆదాయంతో పోలిస్తే ఆస్తి పన్ను ఎంతో కీలకం. మున్సిపాలిటీల నిర్వహణ ఖర్చుకు అవసరమైన సాధారణ నిధి సమీకరణ కోసం ఈ పథకానికి మున్సిపల్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ పథకంపై విసృతంగా ప్రచారం కల్పించి ముందస్తుగా ఆస్తి పన్ను రాబట్టే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
ఈనెల 30లోపు ఆస్తిపన్ను చెల్లించండి
ఐదు శాతం రాయితీ అందుకోండి
మున్సిపాలిటీల్లో ‘ఎర్లీ బర్డ్’ పథకం
ముందస్తు పన్ను చెల్లింపుదారులకు సదావకాశం
సత్కరిస్తూ.. ప్రోత్సహిస్తున్న అధికారులు
సద్వినియోగం చేసుకోవాలి
ముందస్తు పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వం అందిస్తున్న ఐదు శాతం రిబే టును ఇళ్లు, దుకాణాల యజమానులు సద్విని యోగం చేసుకోవాలి. గడువు దాటితే వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. రాయితీని అందరు సద్వినియోగం చేసుకొని పట్టణాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
– సునీత, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్
‘ఎర్లీ’గా కట్టేయండి..
‘ఎర్లీ’గా కట్టేయండి..
‘ఎర్లీ’గా కట్టేయండి..


