ఫార్మాసిటీ భూముల పరిశీలన
యాచారం: మండలంలోని నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీకి సేకరించిన అసైన్డ్, పట్టా భూములను బుధవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పరిశీలించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా శాంతియుతంగా నచ్చజెప్పి సేకరించిన భూములను సర్వే చేసి, ఫెన్సింగ్ వేసేలా చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజుకు సూచించారు. మరోవైపు నేటి నుంచి మొదలయ్యే సర్వే 40 నుంచి 60 రోజుల్లోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆధ్వర్యంలో ఇద్దరు ఆర్ఐలు, ఇద్దరు సర్వేయర్లు, మరో ఆరుగురు రెవెన్యూ, టీజీఐఐసీ సిబ్బంది సర్వేలో పాల్గొననున్నారు. వీరే కాక ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డితో పాటు ఏసీపీ కేపీవీ రాజు ఇతర ఉన్నతాధికారుల బృందం సైతం సర్వే, ఫెన్సింగ్ వేసే విషయంలో భాగస్వాములు కానున్నారు.


