ఇది ఇల్లంతకుంట మండలం దాచారం శివారులో అర్ధంతరంగా నిలిచిపోయిన కాల్వ. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–11లో సిద్దిపేట జిల్లా రంగనాయక్సాగర్ నుంచి నిర్మించిన కాల్వ పొడవు 17.30 కిలోమీటర్లు. అయితే మధ్యలో అక్కడక్కడ భూసేకరణ పెండింగ్లో ఉంది. దీంతో 10.50 కిలోమీటర్లు మాత్రమే కాల్వ పూర్తయింది. దాచారం శివారులో ఎకరం ఒక్క గుంట భూమిని సేకరిస్తే ఈ యాసంగి సీజన్లో దాచారం, పెద్దలింగాపూర్, రామాజీపేట, చిక్కుడోనిపల్లె, తంగళ్లపల్లి మండలంలోని చిన్నలింగాపూర్, నర్సింహులపల్లె, బాలమల్లుపల్లె, బస్వాపూర్, అంకుసాపూర్, తాడూరు వరకు గోదావరి జలాలు అందేవి. భూసేకరణకు నిధులు లేక.. పది గ్రామాల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
సిరిసిల్ల: పాలకులు మారినప్పుడల్లా.. అభివృద్ధి స్వరూపం మారిపోతుండడంతో కొన్ని ప్రాజెక్టులో అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు పట్టించుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యానికి రైతులు బలవుతున్నారు. ఇల్లంతకుంట మండలం దాచారం వద్ద ఎకరం ఒక్క గుంట భూమిని సేకరించి తాత్కాలిక కాల్వను నిర్మిస్తే ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 10 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందే అవకాశం ఉంది. కానీ పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల పట్టింపులేని తనంతో పది గ్రామాల్లో రైతులు సాగునీటికి గోస పడుతున్నారు. గోదావరి జలాలను పొరుగు జిల్లాలకు అందించే మధ్యమానేరు, అన్నపూర్ణ రిజ ర్వాయర్లు రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉన్నా రంగనాయకసాగర్ ద్వారా వచ్చేందుకు సాగునీటి కాల్వ లను నిర్మించలేదు. గతంలో అనామతుగా(అనధికారికంగా) భూసేకరణ జరగకపోయినా.. పట్టాదా రులను ఒప్పించి కాల్వ ద్వారా సాగునీటిని ఆయక ట్టు ప్రాంతానికి తరలించారు. ఈసారి అది సాధ్యం కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.


