నేతన్న కుటుంబానికి సర్కారు బాసట
సిరిసిల్లటౌన్: కుటుంబ అవసరాలకు చేసిన అప్పుల బాధతో మనస్తాపంతో గుండె ఆగిన నేతన్న కుటుంబానికి సర్కారు బాసటగా నిలుస్తోంది. బాధిత కుటుంబం దీనావస్థపై ఆదివారం ‘సాక్షి’ మెయిన్లో ప్రచురితమైన ‘అప్పులతో ఆగిన నేతన్న గుండె’ అనే వార్తకు కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పందించారు. వెంటనే చేనేత, జౌళిశాఖ అధికారులతో విచారణ జరిపించారు. పట్టణంలోని పోచమ్మవీధిలోని పవర్లూమ్ కార్మికుడు వెంగళ ప్రసాద్(45) కుటుంబాన్ని చేనేత జౌళి శాఖ కోఆర్డినేటర్ వేముల మార్కండేయులు పరామర్శించారు. ఆ కుటుంబానికి నేతన్నబీమా రూ.5లక్షలు, ప్రధానమంత్రి జీవనజ్యోతి బ్యాంక్ ఖాతా ద్వారా రూ.2లక్షలు బీమా వర్తించే అవకాశం ఉందన్నా రు. తక్షణ సాయం కింద తహసీల్దార్ ద్వారా రూ.20 వేలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటికి సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరగా అందించేలా ఇందిరమ్మహౌసింగ్ శాఖ పీడీకి తెలుపుతామన్నారు. పిల్లల చదువుల కోసం ప్రభుత్వం తరఫున సాయం అందేలా చూస్తామన్నారు. చేనేత జౌళిశాఖ ఏడీ సంతోష్కుమార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందుతుందని తెలిపారు.


