మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ ఆదివారం వెల్లడించారు. ఎన్నికల కోడ్ విడుదల అయిన వెంటనే పక్కా ప్రణాళికతో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామని వివరించారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని సినారె కళామందిరాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎస్పీ మహేశ్ బి గితేతో కలిసి ఏర్పాట్లు పరిశీలించామని పేర్కొన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కలిపి జోనల్ ఆఫీసర్స్ 21, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 4, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ లు 12 ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు 140, వేములవాడలో 70 మందిని నియమించారు. ఓపీవో 630 మందిని నియామకం చేశారు. రెండు పట్టణాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది 700 మందిని నియమించారు. ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తదితర గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
బల్దియా ఎన్నికలపై పటిష్ట నిఘా
సిరిసిల్లక్రైం: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చెక్పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే చర్యలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, డబ్బు, మద్యం పంపిణీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 5 గంటల తర్వాత ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు 5 గంటలలోపు మున్సిపల్ పరిధిని విడిచిపోవాలని సూచించారు.
మంత్రుల వాహనాలు తనిఖీ
వేములవాడఅర్బన్/సిరిసిల్లఅర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడ– కరీంనగర్ ప్రధాన రహదారిలోని సంకెపల్లిలో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆదివారం మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు వాహనాలను సంకెపల్లి, రగుడు చెక్పోస్టుల వద్ద పోలీసులు తనిఖీ చేశారు.
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం


