అభ్యర్థుల ఆఖరి పోరాటం
నేటితో ఎన్నికల ప్రచారం బంద్ ప్రచారానికి తెర.. ప్రలోభాల ఎర ఓటర్లకు ‘త్రీ–ఎం’ ఫార్ములా సిరిసిల్ల, వేములవాడలో వేడెక్కిన రాజకీయాలు
జిల్లాలో ఎన్నికల స్వరూపం
సిరిసిల్ల: జిల్లాలో పురపోరు తుది అంకానికి చేరుకుంది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అన్ని రాజకీయ పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు ఆరు రోజులుగా మైకులతో ఇంటింటా ప్రచారం సాగించారు. మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరుగుతుండగా.. ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెర పడుతుంది. అసలు వ్యూహాల అమలుకు ఇప్పుడే రంగం సిద్ధమవుతుంది. ఓటర్లను పూర్తి స్థాయిలో ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేశారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు ఓటర్లకు ‘త్రీ–ఎం’ఫార్ములాను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఓటర్ల ప్రసన్నం కోసం
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులంతా పోటీ పడుతున్నారు. ఎవరికీ వారు గల్లీల్లో తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసిపోనుంది. దీంతో త్రీ–ఎం ఫార్ములా.. నేరుగా ఓటర్ల ఇంటికే మద్యం(ఎం), మాంసం(ఎం), మనీ(ఎం) అందించేందుకు సిద్ధమయ్యారు. వార్డుల్లో ప్రచారం ఎలా ఉన్నా.. చివరి రెండురోజుల్లో వ్యూహత్మకంగా ‘త్రీ–ఎం’ ఫార్ములను అనుసరించేందుకు రెడీ అయ్యారు. సిరిసిల్లలో 14 వార్డుల్లో త్రిముఖ పోటీ ఉండగా, 10 వార్డుల్లో చతుర్ముఖ, మరో తొమ్మిది వార్డుల్లో పంచముఖ, ఆరు వార్డుల్లో బహుముఖ పోటీ సాగుతుంది. వేములవాడలోని 28 వార్డుల్లోనూ పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఎన్నికలను చాలెంజ్గా తీసుకున్న అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు ఓటర్లకు గిప్ట్లు, పార్టీ గుర్తులతో కూడిన ఖరీదైన బొమ్మలను పంపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ప్రచారంలో పోటా పోటీ..
ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడల్లో ప్రచారాన్ని అన్ని పార్టీలు జోరుగా సాగిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్తో ప్రచార సభలు నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ వార్డుల్లో రోడ్ షోలు నిర్వహించారు. బీజేపీ నుంచి స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ సిరిసిల్ల, వేములవాడలో ప్రచారం చేశారు. విప్ ఆది శ్రీనివాస్ వేములవాడలో ఉండి ఎన్నికల ప్రచారం చేసి, వ్యూహాలు రచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత సన్నిహితులతో అభ్యర్థులు ఆఖరి ప్రయత్నంగా ఓటర్లకు త్రీ–ఎం పార్మూలా అమలుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మున్సిపల్ వార్డులు బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ స్టేషన్లు ఓటర్ల సంఖ్య
సిరిసిల్ల 39 170 117 81,959
వేములవాడ 28 113 58 40,877
అభ్యర్థుల ఆఖరి పోరాటం


