ప్రచారం బంద్.. ప్రలోభాలు షురూ !
సిరిసిల్ల: ఒక్కరోజు గడిస్తే.. చాలు.. పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే సమయం మొదలైంది. ప్రచార ఆర్భాటాలు ఎలా ఉన్నా ఈ ఒక్క రోజు రాత్రి పోల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్లే విజేతలవుతారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు నజరానాలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికలను పంచభూతాలు శాసిస్తున్నాయి. ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఎంతో కీలకమైంది. నమ్మకు నమ్మకు ఈ రేయిని అంటూ.. బరిలో నిలిచిన అభ్యర్థులను అనుచరులు.. ఆత్మీయులు హెచ్చరిస్తున్నారు.
అంతులేని హామీలు
ఎన్నికల్లో గెలిస్తే... మీ సామాజికవర్గానికి సంఘ భవనాలు నిర్మించి ఇస్తామని, మీ వాడకు సిమెంట్ రోడ్డు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఆడబిడ్డ పుడితే రూ.10వేలు, బాబు పుడితే రూ.5వేలు ఇస్తామంటూ హామీలిచ్చారు.
మద్యం మత్తు
ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ప్రచారంలో అలసి, సొలసిన నేతలకు, కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ బీరు, బ్రాంది, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో మందు విక్రయాలు బాగా పెరిగి ద్వితీయశ్రేణి నాయకులు మత్తులో జోగుతున్నారు.
ముంచెత్తుతున్న డబ్బు
రాజకీయాలంటే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయింది. లాభసాటి వ్యాపారంలా మారింది. ఎంత వెచ్చించాం... ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణమే ఇప్పుడు కనిపిస్తుంది. దీంతో కాసులున్న వారికే పార్టీలు టికెట్ ఇవ్వగా.. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బు పంపిణీనే నమ్ముకున్నారు. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో వార్డులో అభ్యర్థులు రూ.40లక్షల నుంచి రూ.60లక్షల వరకు పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.
వీధికో తీరు.. తాయిలాలు వేరయా
కొందరు అభ్యర్థులు రోజూ బీరు, బిర్యాణీ అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు ఓటర్లకు బంగారం ఉంగరాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు పెద్ద ఎత్తున చీరలు దిగుమతి చేసే మహిళలకు బహుమతిగా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రతీ ఇంటికి 25 కిలోల జై శ్రీరాం బియ్యం బస్తాలను పంపిణీ చేస్తున్నారు. యువకులకు విహారయాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఓటర్లకు వెండి వస్తువులను కానుకలుగా సమర్పిస్తున్నారు. మరికొందరు అనుచరులకు భవిష్యత్లో కాంట్రాక్టు పనులు ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. బల్దియా ఎన్నికల్లో ధనప్రవాహం మరీ ఎక్కువైంది. గెలుపే లక్ష్యంగా అందరూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈసారి ఓటర్లను ఈ పంచభూతాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు.. ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్స్ల్లో నిక్షిప్తమవుతుంది.
పురపోరులో ‘పంచ’భూతాలు
ప్రచారం బంద్.. ప్రలోభాలు షురూ !
ప్రచారం బంద్.. ప్రలోభాలు షురూ !


