
అభివృద్ధి.. సంక్షేమం
పారదర్శకంగా ప్రజాపాలన
పేదరికం.. అసమానతలు.. అంటరానితనంపై పోరాటం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కలెక్టరేట్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల: అభివృద్ధి.. సంక్షేమం.. సుపరిపాలన లక్ష్యంగా.. ప్రజాపాలన సాగుతోందని, పేదరికం, అసమానతలు, అంటరానితనంపై పోరాటం సాగి స్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితేలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ప్రసంగించారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తిలో భాగంగా 23 ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిష్టాత్మక ‘ఆత్మనిర్భర్ సంఘతన్’ జాతీయ అవార్డుకు ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య ఎంపికై ందన్నారు. యాసంగి సీజన్లో 189 కొనుగోలుకేంద్రాల్లో 33,972 రైతుల నుంచి రూ.469.98కోట్ల విలువైన 20,25,800 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. మహిళా సంఘాలకు రూ.6.48కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. స్కూల్ యూనిఫాంలు కుట్టించడం ద్వారా రూ.24.20 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. గ్రామ మహిళా సంఘాలకు 8 ఎకరాల భూమి గుర్తించి, రూ.7.25 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వన మహోత్సవంలో 5.50 లక్షలు మొక్కలు నాటామన్నారు. మెప్మా ద్వారా 248 స్వయం సహాయక సంఘాలకు రూ.34.49 కోట్ల విలువైన బ్యాంక్ రుణాలు అందించామన్నారు. 784 మంది సభ్యులకు సీ్త్రనిధి రుణాలను రూ.7.55 కోట్లు ఇచ్చామన్నారు. జిల్లాలో మొత్తం రూ.4.48 కోట్లతో 283 వ్యక్తిగత యూనిట్లు, రూ.35 లక్షలతో ఐదు గ్రూప్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
జిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధి దారుల బ్యాంకు ఖాతాల్లో రూ.27కోట్లు జమ చేశామన్నారు. 14,075 రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు, 30,376 మంది పేర్లు నమోదు చేశామన్నారు. 5,35,920 మందికి సన్నబియ్యం అందిస్తున్నామని, గృహజ్యోతి పథకంలో 16.51 లక్షల జీరో బిల్లులు జారీ అయ్యాయన్నారు. టీఎస్ఐ– పాస్ ద్వారా రూ.19కోట్లతో 27 పరిశ్రమలను ఏర్పాటు చేసి 249 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. వ్యవసాయానుబంధంగా రూ.1,821 కోట్ల రుణా లు అందించామని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.331 కోట్లు పంపిణీ చేశామని అన్నారు.
వేములవాడ ఆలయ అభివృద్ధికి బాటలు
వేములవాడ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు రూ.213 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలి పారు. రూ.35.25 కోట్లతో అన్నదాన సత్రం, రూ.10కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ, రూ.12 కోట్లతో గుడి చెరువు అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ ని ర్మాణానికి రూ.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. భీమేశ్వర ఆలయంలో రూ.3.44కోట్లతో కల్యాణ మండపం, సీసీ ఫ్లోరింగ్ పనులు చేస్తున్నామన్నా రు. తిప్పాపూర్ బస్స్టాండ్ నుంచి ఆలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ.47కోట్ల మంజూరై, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
నేతన్నలకు అండగా
సిరిసిల్ల నేతన్నలకు రూ.4.30 కోట్ల విలువైన 64,7000 ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్లు ఇచ్చామన్నారు. స్కూల్ యూనిఫామ్స్ కోటి 12 లక్షల మీటర్ల వస్త్రాల ఉత్పత్తి ఆర్డర్లు అందించామన్నారు. 5,137 మంది నేతన్నలకు బీమా కల్పించామని, వివిధ కారణాలతో మరణించిన 77మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున బీమా సొమ్ము అందించామని అన్నారు. ఆరు చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ పథకం కింద ఏటా రూ.45 లక్షలు మంజూరు చేస్తున్నామని, త్రిఫ్ట్ పథకంలో 4,963 మంది నేతన్నలకు ఏటా రూ.12.40 కోట్లు ప్రభుత్వ వాటాగా చెల్లిస్తోందన్నారు.
సీ్త్ర, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి..
జిల్లాలో 150 అంగన్వాడీ కేంద్రాల భవనాలకు శ్రీకారం చుట్టామని, 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా రూ.25 లక్షలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ–జేఈఈ, నీట్–యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా 13,564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. బాలికల సంరక్షణకు మండెపల్లిలో రూ.1.38 కోట్లతో బాలసదనం నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి 24 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు.
వ్యవసాయ అభివృద్ధికి
జిల్లాలో రైతు భరోసాలో 1,26,278 మందికి రూ.149.27 కోట్లు అందించామన్నారు. 393 మంది రైతుల కుటుంబాలకు రూ.18 కోట్ల బీమా పంపిణీ చేశామని, 47,977 మంది రైతులకు రూ.381. 45 కోట్ల పంట రుణాలు మాఫీ చేశామన్నారు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి నీరు విడుదల చేశామన్నారు. రుద్రంగి, మర్రిపల్లి చెరువు పనులు, శ్రీపా ద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజీ–2 ఫేస్–1లోని రుద్రంగి చెరువు పనులు సాగతున్నాయని తెలిపారు. కోనరావుపేట మండలం లచ్చపేట రిజర్వాయర్కు వచ్చే కాలువ పనులు పూర్తయితే జిల్లాలో 40,285 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు.
వేములవాడలో ఇంటర్నేషనల్ స్కూల్
వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరైందన్నారు. రుద్రంగిలో రూ.42కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) మంజూరైందన్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో మహిళా హాస్టల్ పనులు మొదలయ్యాయని తెలిపారు.
రోడ్ల నిర్మాణాలు
జిల్లాలోని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.50.29 కోట్లు 730 పనులకు మంజూరయ్యాయని, ఇందులో 443 పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్లో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులకు రూ.4.45కోట్లు మంజూరయ్యాయని, 16 ఉప కేంద్రాలకు రూ.3.20కోట్లు మంజూరు కాగా, రెండు పూర్తి కాగా, ఒకటి పురోగతిలో ఉందన్నారు. మానాల– మర్రిమడ్ల రోడ్డు పనులు రూ.10కోట్లతో సాగుతున్నాయని, వేములవాడ– సిరికొండ రహదారిపై రూ.10కోట్లతో వంతెన, జవారిపేట– నర్సక్కపేట రహదారిపై రూ.75 లక్షలతో వంతెన, మర్రిపల్లి వద్ద రూ. 2 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. సిరిసిల్లలో కోర్టు భవన కాంప్లెక్స్ రూ.81 కోట్లతో చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల, వసతి హాస్టల్ నిర్మాణానికి రూ.166 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
వేములవాడ, సిరిసిల్ల పట్టణాల అభివృద్ధికి..
వేములవాడ పట్టణంలో రూ.4.20 కోట్లు సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాలకు మంజూరయ్యాయని, రూ.3 కోట్ల నిధులతో పైప్ లైన్ నిర్మాణం, వీధి వ్యాపారులరూ.56 లక్షలతోషెడ్ల నిర్మాణం, మురికి నీరు గుడి చెరువు, మూలవాగులో కలవకుండా రూ. 6 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో రూ.3.10 కోట్లతో రగుడు కూడలి అభివృద్ధి, రూ.50లక్షలలో సీసీ రోడ్లు, మురికి కాల్వ నిర్మాణాలు రూ.15కోట్లతో కొత్త చెరువు నీటి మళ్లింపు, రూ.2.50 కోట్లతో సంజీవయ్య కమాన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్ల మానేరువాగు తీరంలో ఐదెకరాల్లో క్రికెట్ స్టేడియం, చందుర్తి మండలం మూడపల్లి వద్ద మరో స్టేడియం, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల మధ్య చంద్రగిరిలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు రెండుకరాల స్థలం కేటాయించామని తెలిపారు. అదనపు కలెక్టర్ నగేశ్, డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు
సిరిసిల్ల అర్బన్: వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే స్టాళ్లను పరిశీలించారు. 495మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పదోతరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు పోత్సాహక చెక్కులు అందజేశారు.

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం