ఈ చిత్రంలో కనిపిస్తున్న దంపతులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారం గ్రామానికి చెందిన గూడెపు రాము–కవిత. గత జనవరి 26న నిర్వహించిన గ్రామసభలో తమ కుమారుడు శర్వింద్ పేరును రేషన్కార్డులో నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం రేషన్కార్డు ప్రొసీడింగ్ కాపీ అందగా.. అందులో రాము, కవితల పేర్లు తొలగించి వాళ్ల కుమారుడు శర్వింద్ ఒక్కడి పేరిటనే రేషన్కార్డు మంజూరు చేశారు. కార్డులో తమ పేర్లు లేకపోవడంతో తహసీల్దార్ ఆఫీస్కు వెళ్లి కొత్త రేషన్కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు రాలేదు.
● ఏళ్లుగా ఎదురుచూపులే.. ● కొత్తగా పెళ్లయిన దంపతులకు అందని బియ్యం ● పిల్లలు పెరిగినా కార్డుల్లో లేని పేర్లు ● జిల్లాలో 25వేల దరఖాస్తులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన మందాటి రేఖ. రేషన్కార్డులో వీరి దంపతుల పేర్లు ఉన్నాయి. కానీ పిల్లల పేర్లు లేవు. దీంతో 2020లో తన కొడుకు హిమాన్ష్ పేరు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ దరఖాస్తు పెండింగ్లోనే ఉంది. ఇటీవల తన కూతురు శ్రీయాన్షి పేరు సైతం కార్డులో నమోదు చేయాలని రెండో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదటి దరఖాస్తు పెండింగ్లో ఉండడంతో రెండో దరఖాస్తు ఆన్లైన్లో స్వీకరించడం లేదు. ఫలితంగా వీరి పిల్లల పేర్లు రేషన్కార్డులో నమోదుకావడం లేదు. ఇలా జిల్లాలో ఓ వైపు కొత్త రేషన్కార్డులు రాక, ఉన్న కార్డులలో పిల్లల పేర్లు నమోదుకాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్లుగా ఉంది జిల్లాలోని కొత్త రేషన్కార్డుల వ్యవహారం. తమ కార్డుల్లో పిల్లల పేర్లు నమోదుచేయాలని దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రుల పేర్లు తొలగించి పిల్లలనే యజమానులుగా పేర్కొంటూ మంజూరు చేయడంతో అవాక్కవడం పెద్దల వంతైంది. ఇలాంటి వింత సంఘటనలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన పైలట్ గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగుండారంలో కనిపిస్తాయి. ఈ గ్రామంలో కొత్తగా మంజూరైన 37 కార్డులలో 5 కార్డులు ఒంటరి మహిళల పేరుతో రాగా మిగతా కార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు తొలగించి పిల్లలనే యజమానులుగా పేర్కొంటూ మంజూరుకావడం విడ్డూరంగా ఉంది. రేషన్కార్డుల మంజూరులో అనేక తప్పిదాలు జరగడంతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు.
25వేల దరఖాస్తులు
కొత్తగా రేషన్కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవకాశం కల్పించింది. ప్రజాపాలనలో నూతన రేషన్కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని 13 మండలాలు, రెండు మున్సిపాలిటీల వ్యాప్తంగా రేషన్కా ర్డుల కోసం దాదాపు 25వేల దరఖాస్తులు వచ్చి నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇందులో కొత్త పెళ్లయిన దంపతులు, పిల్లల పేర్లు లేని వారు అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు గత నాలుగైదు ఏళ్లుగా రేషన్కార్డులు మంజూరుకాక, పిల్లల పేర్లు నమోదుకాకపోవడంతో వారికి బియ్యం అందడం లేదు. వీటితోపాటు ప్రభుత్వ వివిధ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం రెండు శాఖ లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఆయా శాఖల అధికారులు దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాత కార్డులు మంజూరుకానున్నట్లు సమాచారం.
1.73 లక్షల కార్డులు.. 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం
జిల్లాలో రెండు మున్సిపాలిటీలు, 13 మండలాల వ్యాప్తంగా 1,73,745 రేషన్కార్డులున్నాయి. 4,97,103 కుటుంబాలు ఉండగా వీరి కోసం 3,300 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతీ నెల వస్తోంది. ఆయా కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే గ్రామపంచాయతీల సెక్రటరీలు, ఇతర ఉద్యోగుల ద్వారా సమాచారం అందడంతోనే వారి పేర్లు తొలగిస్తున్న అధికారులు.. కొత్తగా పేర్లు నమోదు చేయాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు.
డీఎస్వోలో పెండింగ్ ఉన్నాయి
రేషన్కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశాం. మా దగ్గర పెండింగ్ లేవు. ఆన్లైన్ చేసిన దరఖాస్తులు డీఎస్వోలో పెండింగ్ ఉన్నా యి. ఎప్పుడు మంజూరవుతాయో సమాచారం లేదు. – సుజాత, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్
జిల్లాలో రేషన్కార్డుల సమాచారం
రేషన్కార్డులు : 1,73,745
కుటుంబాలు : 4,97,103
నెలవారీ బియ్యం కోటా : 3,300 మెట్రిక్ టన్నులు
కొత్త దరఖాస్తులు : 25 వేలు
కార్డు రాక పరేషాన్
కార్డు రాక పరేషాన్
కార్డు రాక పరేషాన్
కార్డు రాక పరేషాన్