● రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్
యర్రగొండపాలెం: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.లక్ష కోట్లు మంజూరు చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని గంగాపాలెంలో ఎల్నీనో ప్రభావంతో ఎండిపోయిన మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు వేల రూపాయలు అప్పులు చేసి భూములు దున్ని సిద్ధం చేసుకున్నా.. వర్షం జాడలేక పంటలు నిలువునా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బక్కయ్య అనే రైతు తన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు కిలోమీటరు దూరం నుంచి బోరు ద్వారా నీరు పెడుతున్నా ఫలితం దక్కలేదన్నారు. భూగర్భ జలాలు అడుగంటి రైతులు అల్లాడుతున్నారని, ప్రభుత్వం వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఐ నాయకులు కె.వి.కృష్ణగౌడ్, దేవేండ్ల శ్రీనివాస్, బాణాల రామయ్య, మన్నె సాంబశివరావు, వై.వెంకటశివయ్య, నక్కా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పుల్లలచెరువు: వర్షం వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. పుల్లలచెరువులో సోమవారం భారీగాలులతో కూడిన వర్షానికి అరటి తోటల్లో చెట్లు విరిగిపోయాయి. మిర్చి పంట నీటమునిగింది. దీంతో నష్టపోయిన పంట పొలాలను బుధవారం కేవీ ప్రసాద్ పరిశీలించారు. ఎంత మేర నష్టపోయారని రైతులు టి.వెంకటేశ్వర్లు, నరసయ్య, కే వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేవీ ప్రసాద్ మాట్లాడుతూ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలవాలని, వెంటనే రూ.50 వేలు ఇవ్వాలన్నారు. పంట నష్టంపై అధికారులు సమగ్రంగా అంచనాలు వేయాలని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. ఆయన వెంట సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బానాల రామయ్య, మండల కార్యదర్శి సాంబశివరావు, అల్లం నారాయణ, మండల సీపీఐ కార్యదర్శి గురునాథం, రైతులు పాల్గొన్నారు.


