అక్రమ కేసులకు జడిసే ప్రసక్తే లేదు.. రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కొండపిలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆదిమూలపు సురేష్ మంత్రుల దోపిడీయే తప్ప అభివృద్ధి శూన్యమని మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి విమర్శ
కొండపి: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టేలా వైఎస్సార్ సీపీ శ్రేణులు సమష్టిగా పోరాడాలని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కొండపిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఓట్ల సర్వే ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో 32,123 మందికి నోటీసులు ఇవ్వగా, వారిలో 2,000 మంది సమాధానం ఇవ్వలేదన్నారు. మొత్తం 2.40 లక్షల ఓటర్లలో దాదాపు 30 వేల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, చివరికి మిగిలే 2.10 లక్షల ఓట్లతోనే స్థానిక సమరానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, రెండేళ్ల పాలన అవినీతికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా కొండపిలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ, ఇళ్లు, ప్రహరీ గోడలు, బొప్పాయి తోటలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది, వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా ఒకే నోటిఫికేషన్తో లక్షలాది సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. ప్రస్తుత కూటమి సర్కార్ మెగా డీఎస్సీ పేరిట నిరుద్యోగులను దగా చేసిందన్నారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసి అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులున్నా దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, మట్టి, ఇసుక, మద్యం మాఫియాతో జేబులు నింపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాతో నెలకు రూ.30 లక్షలు గడిస్తున్నారని ఆరోపించారు. పథకాలు అమలు చేయకుండా మహిళలు, వృద్ధులను మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కొండపిలోని పంచాయతీల్లో కనీసం 50 శాతం స్థానాల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి, 2029లో నియోజకవర్గాన్ని జగనన్నకు కానుకగా ఇవ్వాలని కోరారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. కొండపిలో ఇద్దరు మంత్రులున్నా చేసిన అభివృద్ధి శూన్యమని, ఎక్కడ చూసినా జేసీబీలతో చెరువుల మట్టిని కొల్లగొడుతున్నారని విమర్శించారు. రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ అమ్మకానికి పెట్టిందని, దమ్ముంటే మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, దామచర్ల సత్య ప్రెస్మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, గతంలో జగన్మోహన్రెడ్డి పాలనలోనే కమ్మవారికి సముచిత గౌరవం దక్కిందని, వెలుగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టిన ఘనత వైఎస్సార్దేనన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం, సినీ నటి వ్యవహారాల్లో సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ ఎంకై ్వరీ వేయడానికి కూటమి పాలకులు వణికిపోతున్నారని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఇటీవల శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై న తూమాటి మాధవరావును ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు షంషీర్ అలీ బేగ్, పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, ఆరు మండలాల కన్వీనర్లు బచ్చల కోటేశ్వరరావు, స్మశానం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసులు, ఇనుకొల్లు సుబ్బారెడ్డితో పాటు పలువురు స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


