ఖరీఫ్లో ప్రధాన పంటల
సాగు వివరాలు (హెక్టార్లలో)
చేయాల్సింది చేసింది
(నార్లు పోసుకోవటం)
న్యూస్రీల్
అన్నదాతకు కష్టకాలం
ప్రభుత్వం సహకరించదు.. వరుణుడు కనికరించడు
సీజన్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా చినుకు కోసం ఎదురుచూపులు
55,774 హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేయాల్సిన వైనం
ఇప్పటివరకు సాగు చేసింది కేవలం 1,700 హెక్టార్లలోనే..
సాగుకు నోచుకోని ప్రధాన పంటలు
అడుగంటుతున్న భూగర్భ జలాలు
వరుణించని
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
ఖరీఫ్ సీజన్ మొదలై 40 రోజులు దాటినా వరుణుడుకరుణించకపోవడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతన్న గుండెల్లో ఆందోళన మేఘాలు కమ్ముకున్నాయి.
ఒకవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయగా, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతును మరింత కష్టాల్లోకి
నెట్టింది. జిల్లాలో 55,774 హెక్టార్లలో వివిధ పంటలు
సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం
1,700 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి.
ప్రధాన పంటల విత్తనాలు నేలను తాకలేదు.
భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, విత్తనాలు,
ఎరువులు, పెట్టుబడి, బీమా, కౌలు రైతులకు సాయం వంటి ప్రతి అంశంలో రైతు అగచాట్లు పడుతున్నాడు. వరుణుడి కోసం ఆకాశం వైపు, ప్రభుత్వ సాయం కోసం అధికారుల వైపు ఆశగా ఎదురుచూస్తూ ఈ ఖరీఫ్లో ఎలా గట్టెక్కాలా అనే ఆందోళనలో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతన్నలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా చినుకు రాలక సాగు ముందుకు సాగడం లేదు. వాన చినుకు సంగతి దేవుడెరుగు.. విత్తనం నుంచి పంటల బీమా వరకు అన్నదాతలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకపక్క అరకొరగా పెట్టుబడి సాయం.. కౌలు రైతులకు రిక్తహస్తం.. అందని మోంథా పరిహారం.. జాడలేని కరువు సాయం.. ఇలా రైతన్నను అన్నిరకాల ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అదునుకు సబ్సిడీ విత్తనాలు సైతం అందక నానాపాట్లు పడుతున్నారు. ఎరువుల కోసం ప్రవేశపెట్టిన యాప్తో ఎరువుల పంపిణీ సకాలంలో అందక అగచాట్లు పడుతున్నారు. రైతులు విత్తులోనే ఆర్థికంగా నష్టపోతున్నారు. దీంతో కౌలు రైతుల చేతిలో చిల్లిగవ్వ లేక పెట్టుబడి కోసం అప్పుల వారి చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతున్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్ నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ ఏడాది ఖరీఫ్లో సగానికి సగం పంటలు కూడా సాగుకాలేదు. 1025–26లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ ఖరీఫ్ సీజన్ 2026–27తో ప్రారంభమైంది. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారింది.
40 రోజులు.. 1,700 హెక్టార్లు...
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 40 రోజులు కావస్తోంది. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు వెంటాడుతుండగా సర్కారు ప్రోత్సాహం లేక రైతులు పంటల సాగుకు వెనకాడుతున్నారు. సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులైనా.. ఇప్పటి వరకూ కేవలం 1,700 హెక్టార్లలోనే వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇప్పటి వరకూ ప్రధాన పంటల సాగు ఊసేలేకుండా పోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 55,774 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగుచేయాల్సి ఉంది. సాగు పరిస్థితిని తలచుకుంటేనే రైతన్న గుండె గుబేలవుతోంది. చంద్రబాబు పాలన మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. చంద్రబాబు పాలన ప్రారంభమైన 2024–25లో ఖరీఫ్ సీజన్లో ఈ సమయానికి వివిధ పంటలు కేవలం 1,300 హెక్టార్లలోనే సాగయ్యాయి. 2025–26 ఖరీఫ్ సీజన్లో 1,550 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగు చేశారు. మరి 2026–27 ఖరీఫ్ సీజన్లో 1,700 హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగు చేశారు.
పంట రకం సాగు సాగు
కందులు 25440 02
వరి 10142 712
సజ్జ 2773 85
మొక్కజొన్న 3047 111
మినుములు 1926 22
పెసర 222 00
నువ్వులు 2195 19
వేరుశనగ 681 478
ఆముదం 294 06
పత్తి 6997 82
పొగాకు 1536 00
చెరకు 106 152
వర్షాలు కురవక కొత్త పిలకలు రాలేదు
నేను ఒకటిన్నర ఎకరా మెట్ట పొలంలో జామాయిల్ సాగు చేస్తున్నా. మూడు నెలల క్రితం చెట్లు కొట్టేశాను. ఇటీవల వర్షాలు కురవకపోవడంతో ఇంత వరకు కొత్త పిలకలు రాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే రెండు సంవత్సరాలలో మళ్లీ కోతకు వస్తాయి. అదే వర్షాలు కురవకపోతే కోతకు వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నాను.
– ధన్నాసి ప్రభాకరరావు, రైతు,
పాతసింగరాయకొండ
వర్షం కోసం ఎదురుచూస్తున్నా
నాకు ఒకటిన్నర ఎకరా మెట్ట పొలం ఉంది. ప్రతి సంవత్సరం కంది పంట సాగు చేస్తాను. ఈసారి వర్షాలు కురవకపోవటంతో కంది సాగు చేయటానికి అవకాశం లేదు. వర్షం కోసం ఎదురుచూస్తున్నా. వర్షాలు కురవకపోతే ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి.
– కోవూరి పెద్దన్న, రైతు, మర్రిపూడి
అడుగంటుతున్న భూగర్భ జలాలు...
జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలోనే భూగర్భ జలాలు లోలోపలకు వెళ్లిపోతున్నాయి. జూన్ మాసంలో అడపాదడపా వర్షాలు పడినా భూ తాపానికి నీరు నిలబడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్లో 57 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే 50 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇక, జూలైలో 87 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంది. వేడిగాలులకు అక్కడక్కడా తుంపర్లు పడ్డాయిగానీ ఇంత వరకూ సరైన వర్షం జల్లు ఒక్కటి కూడా పడలేదు. దాంతో పంట భూములు బీటలు వారి పగుళ్లిచ్చే పరిస్థితులు దాపురిస్తున్నాయి. రాయలసీమలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. అక్కడి పరిస్థితులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.


