
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తుల ఆహ్వానం
ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులందరూ 2025 సంవత్సరానికి ఉపాధ్యాయ దినోత్సవ (గురుపూజోత్సవం) సెప్టెంబరు 5న జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు అర్హత కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ ఎ.కిరణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23వ తేదీలోపు ఎంఈఓలకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. మండల విద్యాశాఖాధికారులు పరిశీలించిన దరఖాస్తులను డిప్యూటీ డీఈఓకు 25వ తేదీలోపు అందించాలన్నారు. డిప్యూటీ డీఈఓలు పరిశీలించిన దరఖాస్తులను 27వ తేదీ లోపల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుకు కనీసం 15 సంవత్సరాల బోధనా అనుభవం కలిగి ఉండాలని, ఎటువంటి క్రమశిక్షణ చర్యలకు లోనై ఉండకూడదని తెలిపారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని కమలా విద్యా సంస్థల ప్రాంగణంలో సీబీఎస్ఈ స్కూళ్ల సౌత్ ఇండియా జోన్ 1 తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలను శుక్రవారం కళాశాల కరస్పాండెంట్ పవన్ కుమార్, అకడమిక్ డైరెక్టర్ సింధూజ ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల పోటీలను మార్కాపురంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, అండమాన్, పుదుచ్ఛేరి నుంచి 1200 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో తైక్వాండ్ టోర్నమెంటు అబ్జర్వర్ డాక్టర్ సీ దొరై, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముఖేష్కుమార్, ఏపీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కె అబ్దుల్ సలాం, ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ అఖిల్ పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ పరిశీలనకు మొత్తం 349 మంది అభ్యర్థులకు గాను 327 మంది హాజరయ్యారు. 153 మంది సివిల్ అభ్యర్థులకు గాను 144 మంది, 196 ఏపీఎస్పీ అభ్యర్థులకు గాను 183 మంది హాజరయ్యారు. అభ్యర్థుల కుల ధ్రువీకరణ పత్రాలు, స్థానికత సర్టిఫికెట్లు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్లు పరిశీలించారు. మూడు సెట్ల అటెస్టేషన్ పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ ఉద్యోగాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించారన్నారు. పత్రాల పరిశీలన అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులను తదుపరి నియామక దశకు ఎంపిక చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఏఏఓ పీఈ విజయ కుమార్, ఆర్ఐలు సతారామిరెడ్డి, రమాణా రెడ్డి, డీపీఓ సూపరింటెండెంట్ షేక్ సందాని బాషా, డి.శైలజ పాల్గొన్నారు.
పుల్లలచెరువు: అక్రమంగా నిల్వ ఉంచిన రూ.84.20 లక్షల విలువైన మొక్కజొన్న, కంది విత్తనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసిన ఘటన పుల్లలచెరువులో శుక్రవారం జరిగింది. ఇన్వెక్టా అగ్రీటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనుమతి పత్రాలు లేని, స్టాక్ రిజిస్టర్లో నమోదు చేయని 252.27 క్వింటాళ్ల మొక్కజొన్న, కంది విత్తనాలను సీజ్ చేసి వాటి అమ్మకాలను నిలిపేసినట్లు ఏఓ గోపికృష్ణ, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ జవహర్ నాయక్ తెలిపారు. ఈ తనిఖీల్లో డీసీటీఓ బి.రామారావు, సీఐ ఎన్.రాఘవరావు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు దరఖాస్తుల ఆహ్వానం