
దూరం దూరం
రైతుసేవ..
గ్రామంలోనే కొనసాగించాలి
గ్రామంలో రైతు సేవా కేంద్రానికి సొంతభ భవనం ఉన్నప్పటికీ తొలగించి పాపినేనిపల్లిలో విలీనం చేశారు. పొలాలకు ఎరువులు తీసుకోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలోనే రైతుసేవా కేంద్రాన్ని కొనసాగించేలా చూడాలి.
– సిద్దారెడ్డి ఓబుల్ రెడ్డి, రైతు, బొల్లుపల్లి,
అర్థవీడు మండలం
విలీనంలో భాగంగా తొలగించిన కంభం–3 రైతు సేవా కేంద్రం
జిల్లాలో ఏర్పాటైన రైతు సేవా కేంద్రాలు: 584
విలీనం చేసిన కేంద్రాలు: 88
కంభం:
రైతులు వారి గ్రామాల్లోనే ఎరువులు, విత్తనాలు తీసుకునేందుకు, ఇతర సమస్యలు పరిష్కరించుకోవడం కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ సచివాలయాల పరిధిలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందించడం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరుమార్చేసింది. ఏడాదిగా రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో రైతు సేవా కేంద్రాలను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేసిన కూటమి ప్రభుత్వం వాటి సంఖ్యను తగ్గించేసింది. జిల్లాలో గిద్దలూరు, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, దర్శి, యర్రగొండపాలెం వ్యవసాయ సబ్ సబ్డివిజన్ లు ఉండగా వాటి పరిధిలో 584 రైతు సేవా కేంద్రాలున్నాయి. విలీనం పేరుతో 88 రైతు సేవా కేంద్రాలను మరో రైతు సేవా కేంద్రాల్లోకి కలిపేయడంతో ప్రస్తుతం 496 కు చేరుకున్నాయి. దీంతో రైతు సేవాకేంద్రాలు తొలగించిన గ్రామాల్లోని రైతులు పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ–క్రాప్ ఆధారంగా విలీనం:
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చేసిన ఈ క్రాప్ బుకింగ్లను ప్రామాణికంగా తీసుకొని రైతు సేవా కేంద్రాలను విలీనం చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఈ క్రాప్ బుకింగ్ చేసిన విస్తీర్ణానికి, పూర్తి విస్తీర్ణానికి వ్యత్యాసం ఉంటుందని, అలాంటప్పుడు దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పనిభారం పెరుగుతుందంటున్న వీఏఏలు:
వీఆర్వోలు, సర్వేయర్లను మాత్రం సచివాలయాల వారీగా అలాగే ఉంచి కేవలం వీఏఏలను మాత్రమే విలీనం చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. విలీనం చేసిన నేపథ్యంలో మిగిలిన వీఏఏలను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రాప్ ఆధారంగా రైతు సేవా కేంద్రాలను విలీనం చేసి తిరిగి ఇప్పుడు ఏరియా మొత్తాన్ని ఈ క్రాప్ చేయమని చెబుతుండటంతో పని భారం పెరుగుతుందని వీఏఏలు వాపోతున్నారు.
రైతుసేవా కేంద్రాలపై విలీనం పిడుగు విలీనం పేరుతో రైతుసేవా కేంద్రాల కుదింపు మిగిలిన సిబ్బంది ఇతర జిల్లాలకు బదిలీ పనిభారం పెరుగుతుందంటున్న వీఏఏలు ఎరువులు, విత్తనాల కోసం రైతులుపక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి
ప్రస్తుతం ఉన్న రైతు సేవా కేంద్రాలు: 496
రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు అవసరమైన ఎరువులను అందించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలను విలీనం పేరుతో తగ్గించి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది.
– నెమలిదిన్నె చెన్నారెడ్డి, వైఎస్సార్ సీపీ స్టేట్ యూత్వింగ్ సెక్రటరీ
రైతులకు తప్పని తిప్పలు
కొన్ని ప్రాంతాల్లో గ్రామాలకు ఆనుకొని పంటపొలాలు ఉన్నా ఇలాఖా పరంగా అవి ఇతర గ్రామాల్లో ఉన్నాయి. అధికారులు వాటిని ప్రామాణికంగా తీసుకోకుండా విలీనం చేయడంతో రైతులు తమ అవసరాల కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంభం మండలం జంగంగుంట్ల రైతు సేవా కేంద్రాన్ని 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్కోట రైతుసేవా కేంద్రంలో విలీనం చేయడంతో అక్కడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే విధంగా జిల్లాలో పలు చోట్ల రైతు భరోసా కేంద్రాలను విలీనం చేయడంతో రైతులు 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.

దూరం దూరం