
ఎయిర్పోర్టుకు 1,080 ఎకరాల భూ సేకరణ
● జేసీ గోపాలకృష్ణ
కొత్తపట్నం: మండలంలోని అల్లూరు–ఆలూరు మధ్యలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 1,080 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఏడీ సర్వేయర్ బాషా, కొత్తపట్నం తహసీల్దార్ మధుసూదన్రావు, మండల సర్వేయర్ సుధీర్బాబు, ఆర్ఐ వరప్రసాద్, వీఆర్వో బాలస్వామితో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో భూములను జేసీ పరిశీలించారు. కొప్పో లు దగ్గర్లోని నక్కలవారిపాలెం ఉత్తరం రోడ్డును పరిశీలించారు. అల్లూరు–ఆలూరు రోడ్డు, ఆలూరు పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కొప్పోలు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 454, 457, 453లో 9 ఎకరాలతో పాటు అల్లూరు రెవెన్యూ పరిధిలో 2280, 2281, 2282, 2283 సర్వే నంబర్లు, ఆలూరు రెవెన్యూ పరిధిలోని 506, 507, 508, 513 సర్వే నంబర్లలో కలుపుకుని మొత్తం 1,080 ఎకరాల భూ సేకరణ జరగాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్కు 744 ఎకరాలు సరిపోతుందని, భవిష్యత్లో వివిధ రకాల అవసరాల నిమిత్తం 336 ఎకరాలు అదనంగా సేకరించాల్సి ఉందని జేసీ అన్నారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.