
స్థల వివాదంలో బంధువుల కొట్లాట
తాళ్లూరు: స్థలం వివాదంలో బంధువుల మధ్య కొట్లాట జరగడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని శివరామపురంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పోటు వెంకటేశ్వర్లు, పోటు సీతయ్య అన్నదమ్ములు. వీరికి పక్క పక్కనే సొంత స్థలాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ స్థలాల్లో అన్నదమ్ములిద్దరూ మెరక తోలించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. మధ్యలో బంధువులు కలగజేసుకుని ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంకటేశ్వర్లు బంధువు పోటు కోటయ్య తీవ్ర గాయాలతో ఒంగోలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఉదయం సీతయ్య కుమారుడు విజయవాడ నుంచి వచ్చి వెంకటేశ్వర్లు బంధువు పోటు వీరాంజనేయులుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బంధువులు ఆయన్ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కౌంటర్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.