శ్రీశైలం యాత్రికులకు ట్రాఫిక్ ఆంక్షలు
● పెద్దదోర్నాలలో ఐదు గంటలకుపైగా నిలిచిన వాహనాలు
పెద్దదోర్నాల: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా శ్రీశైలం తరలి వెళ్తున్నారు. దీంతో ఉగాది పర్వదినాన శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులతో మండల కేంద్రంలో భారీ రద్దీ ఏర్పడింది. కర్ణాటక నుంచి తమ ఇంటి ఆడపడుచు బ్రమరాంబదేవి అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించేందుకు కర్ణాటక వాసులు పలు వాహనాల్లో శ్రీశైలానికి భారీగా తరలి వెళ్లడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉగాది పర్వదినాన శ్రీశైలం వెళ్లే యాత్రికులతో భారీ రద్దీ ఏర్పడింది. రద్దీ నేపథ్యంలో శ్రీశైలానికి వెళ్లే వాహనాలను పోలీసు అధికారులు మండల కేంద్రంలోనే నిలిపేశారు. పోలీసులు విధించిన ఆంక్షలతో యాత్రికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు యాత్రికులను మండల కేంద్రంలోనే నిలిపేయడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలను మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలో నిలిపేయడంతో యాత్రికులు అవస్థలు పడ్డారు. శ్రీశైలంలో భారీ రద్దీ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహనాలు నిలిపేసినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.