సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం వైఎస్ జగన్
అభ్యర్థులు నిజాయితీగా ఉద్యోగం పొందేందుకు ఏళ్ల తరబడి కాలాన్ని, డబ్బును వెచ్చిస్తారు
అయితే వ్యవస్థ విఫలమైతే మొత్తం నియామక ప్రక్రియపైనే నమ్మకం పోతుంది
చివరకు వారు తీవ్ర నిరాశకు గురవుతారు
అర్హులకు ఉద్యోగాలివ్వడం అన్నది మీ ఇష్టాయిష్టాలు కావు.. అది ప్రభుత్వ బాధ్యత
వాళ్లు పడిన కష్టానికి న్యాయం చేయాలన్న బాధ్యత, జవాబుదారీతనం మీకు లేదా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తారా.. లేదా? అని ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియ మీద విశ్వసనీయత పోతే నిరుద్యోగుల కలల రెక్కలు విరిగిపోతాయన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘లక్షల మంది అభ్యర్థులు న్యాయమైన అవకాశం కోసం తమ జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని ఈ పరీక్షల కోసం వెచ్చిస్తారు. కష్టపడి చదివి నిజాయితీగా ఉద్యోగం పొందడం కోసం వారి కుటుంబాలు కష్టపడి సంపాదించిన డబ్బును కూడా వెచ్చిస్తారు.
కానీ, వ్యవస్థ విఫలమై దానిని నిరాశ పరిచినప్పుడు, దాని ప్రభావం కేవలం ఫలితాలపైనే కాదు.. మొత్తం నియామక ప్రక్రియపైనే అభ్యర్థులకు ఉండే నమ్మకం పోతుంది. చివరకు వారు తీవ్ర నిరాశకు గురవుతారు. చంద్రబాబూ.. న్యాయంగా పరీక్షలు నిర్వహించి, అర్హులకు అవకాశం ఇవ్వడం అన్నది మీ ఇష్టాయిష్టాలు కావు. అది ప్రభుత్వం బాధ్యత. వాళ్లు పడిన కష్టానికి న్యాయం చేయాలన్న బాధ్యత, జవాబుదారీతనం అవసరమని మీకు అనిపించడం లేదా? ప్రస్తుతం బయట పడిన డీఎస్సీ కుంభకోణానికి మీరు బాధ్యత వహిస్తారా.. లేదా?’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.


