
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హోం మినిస్టర్పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, సరస్వతి పవర్ భూముల్లో పర్యటన అంశాలపై గురువారం జగన్ మీడియాతో మాట్లాడారు.
‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ భూముల్లో పర్యటించారు. ఆ భూములన్నీ పట్టా భూములే. వెయ్యి ఎకరాల్లో నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని తీసుకోలేదనే విషయాన్ని.. పవన్ ఆదేశాలతో అక్కడికి విచారణకు వెళ్లిన ఎమ్మార్వోనే చెప్పారు.( ఆ వీడియోను జగన్ ప్రదర్శించి చూపించారు). అలాంటి ప్రాంతానికి పవన్ వెళ్లారు. ఆపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
.. సరస్వతి పవర్ కోసం నేను తీసుకున్నదంతా ప్రైవేట్ భూములే. గ్రామసభలో రైతులు అడిగిన రేటు కంటే ఎక్కువే(ఎకరాకు 2.70 లక్షలు అయితే రూ.3 లక్షలు) ఇచ్చి కొన్నాం. అది జగన్ అంటే.
.. సిమెంట్ ఫ్యాక్టరీలకు నీరు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా?. సరస్వతి పవర్ కట్టకపోవడానికి కారణం టీడీపీ, కాంగ్రెస్వాళ్లే. వాళ్ల కేసుల వల్లే ఈడీ అటాచ్ చేసింది. పవన్ ఏం మాట్లాడుతున్నారో.. ఎలా మంత్రి అయ్యాడో అర్థం కావడం లేదు.
.. పవన్కు చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. అందుకే తోలు తీస్తా అంటూ డైలాగులు కొడుతున్నారు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రశ్నించాల్సింది సీఎంను. కానీ, ఓ దళిత మంత్రిని పవన్ విమర్శించారు’’ అని జగన్ అన్నారు.
