చంద్రబాబు బీచ్‌ షాక్స్‌ ప్లాన్‌, జగన్‌ ఏమన్నారంటే.. | YS Jagan Raises Safety Concerns Over AP Govts Beach Shack Policy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బీచ్‌ షాక్స్‌ ప్లాన్‌, జగన్‌ ఏమన్నారంటే..

Jul 1 2026 1:21 PM | Updated on Jul 1 2026 1:27 PM

YS Jagan Raises Safety Concerns Over AP Govts Beach Shack Policy

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలకు విశ్రాంతి, వినోదానికి కేంద్రాలుగా ఉండాల్సిన బీచ్‌లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బీచ్‌ షాక్స్‌ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి ప్రభుత్వం తెరలేపుతోందని, ఇది రాష్ట్ర సామాజిక వాతావరణానికి ప్రమాదకరమని గుర్తు చేశారు.

తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్‌, బీచ్‌ షాక్స్‌ పేరుతో మద్యం విక్రయాలను ప్రోత్సహించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీచ్‌లు కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ప్రశాంతంగా గడిపే ప్రదేశాలుగా ఉండాలే తప్ప, మద్యం విక్రయాల కేంద్రాలుగా మారకూడదన్నారు.

"బీచ్‌ షాక్స్‌ పేరుతో మద్యం అమ్ముతారా? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తం కలిసి బీచ్‌కు ఎలా వెళ్తారు?" అని జగన్‌ బాబు సర్కార్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం, లాకప్‌ డెత్‌లు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్‌ ఆరోపించారు. "చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?" అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్‌ విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, అవినీతి, దోపిడీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం లేదు. కానీ దోచుకున్న సొమ్ము మాత్రం విదేశాలకు వెళ్తోంది" అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement