‘పాగల్‌ పాలనలో తిరగబడ్డ తెలంగాణ’.. కేటీఆర్‌ తీవ్ర విమర్శలు | KTR Sensational Comments On Revanth Reddy Govt Over Vikarabad Collector Attack Incident | Sakshi
Sakshi News home page

‘పాగల్‌ పాలనలో తిరగబడ్డ తెలంగాణ’.. రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

Nov 12 2024 9:11 AM | Updated on Nov 12 2024 9:49 AM

Vikarabad KTR Sensational Comments On Revanth Govt

హైదరాబాద్‌, సాక్షి: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు సంచలన విమర్శలు చేశారు. ఇందుకోసం.. వికారాబాద్‌ కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలో ఫార్మా కంపెనీ అభిప్రాయసేకరణ సందర్భంగా అధికారులపై గ్రామస్తులు జరిపిన దాడి సంగతిని కేటీఆర్‌ ప్రధానంగా ప్రస్తావించారు.

‘‘తెలంగాణ తిరగబడుతోంది-తెలంగాణ తల్లడిల్లుతోంది. కుటుంబ దాహం కోసం తన ప్రాంతంపై కుట్రలు చేస్తే లగచర్ల లాగయించి ఎదురొడ్డుతుంది. ‘మా భూములు మాకేనని’.. కొడంగల్ కొట్లాడుతుంది. పసలేని, పనికిరాని పాగల్ పాలనలో తెలంగాణ ఆగమైతుంది.  కుట్రల కుతంత్రపు పాలనలో కట్టలు తెంచుకునే కోపం తో నా తెలంగాణ గరమైతుంది. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి ఎలుబడిలో రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అసంతృప్తులివి..

.. ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్నలు, హైడ్రా’ దౌర్జన్యాల పట్ల సర్కారుపై జనం తిరుగుబాటు, మూసీలో ఇండ్ల కూల్చివేతలపై దుమ్మెత్తిపోస్తున్న బాధితులు, పెండింగ్ బకాయిలు చెల్లించాలని మాజీ సర్పంచ్‌ల నిరసన, ఉపాధి దూరంచేసిన అసమర్థ ప్రభుత్వంపై నేతన్నల ధిక్కారం, ఆర్థిక సాయంతో ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల మహా ధర్నా, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుపై భగ్గుమన్న విద్యార్థి లోకం, ఫార్మా కోసం భూములు లాక్కోవద్దని అన్నదాతల కన్నెర్ర, కులగణనలో అడుగుతున్న ప్రశ్నలపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి, గురుకులాల్లో అవస్థల పరిష్కారానికి రోడ్డుపై విద్యార్థుల బైఠాయింపు’’.. అంటూ కేటీఆర్‌ తన ఎక్స్‌ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. 
 


ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్‌.. అమృత్‌ పథకంలో అవినీతి జరిగిందంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న  రేవంత్ పై  ఆఫీస్ ఆఫ్  ప్రాఫిట్ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసి కేటీఆర్‌ కోరారు.

ఇదీ చదవండి: తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా?

Advertisement
 
Advertisement
Advertisement