కులాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు
అగ్ని ప్రమాదంలో పది మంది చనిపోతే కేసు పెట్టరా?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్
సాక్షి, హనుమాన్ జంక్షన్ రూరల్ : ‘ఏ సమస్య వచ్చినా దానికి కులం రంగు పూయడం చంద్రబాబునాయుడుకు అలవాటైంది. కమ్మ వాళ్లను భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం బాపులపాడు మండలం ఆరుగొలనులో మీడియాతో మాట్లాడారు. ఐదు నెలల్లో నాలుగు రోజులు మాత్రమే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఫోన్ను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవ్వరికి లేదన్నారు. వంశీ ఇంకా ఏమన్నారంటే..
► ఉమక్క (దేవినేని ఉమ) చెప్పే దానికి ఏమైనా అర్థం ఉందా? 70 లక్షల మంది కమ్మ వాళ్లపై ఎవరు కక్ష సాధిస్తారు? నాపై, మీపై ఎవరైనా కక్ష సాధిస్తున్నారా? తప్పు చేసినప్పుడు కేసు పెడితే కక్ష సాధింపు ఎలా అవుతుంది? మీకు (రమేష్ హాస్పటల్స్) ఆరోగ్యశ్రీ బిల్లులు మొత్తం ఇచ్చినప్పుడు జగన్మోహన్రెడ్డి మంచితనం కనపడలేదా?
► రమేష్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం చేశారా? లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుని, కరోనా లేని వారిని కూడా హోటల్లోని కోవిడ్ సెంటర్లో పెట్టారు. ఇలాంటి ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. కానీ అక్కడ బాబు, లోకేష్ నోరు పెగలదు. మన దగ్గరే విచిత్రం.
► విశాఖలోని ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగాక కేసులు పెట్టారు. వారిని అరెస్టు చేయాలని చంద్రబాబు రోజూ ప్రెసిడెంట్కు, పీఎంకు లేఖలు రాశారు. మీ ఆసుపత్రిలో పది మంది ప్రాణాలు పోయి, కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు కులం కనపడుతుంది.