
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు హౌజ్ అరెస్ట్ (గృహ నిర్బంధం)పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదే నిదర్శమని, కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని మండిపడ్డారాయన.
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడివద్ద హిందూ సంఘాలు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిసున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి హాజరవుతారనే అనుమానాల నడుమ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
‘‘పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భాగ్య నగర్ లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం అని అన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కన్పిస్తోంది..
.. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయి’’ అని బండి సంజయ్ అన్నారు.