హర్యానా కౌంటింగ్‌ అప్‌డేట్‌లో జాప్యం.. ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు | Unexplained Slowdown: Congress Complains To Poll Body On Haryana Results | Sakshi
Sakshi News home page

హర్యానా కౌంటింగ్‌.. ఈసీ వెబ్‌సైట్‌ అప్‌డేట్‌లో జాప్యంపై కాంగ్రెస్‌ ఫిర్యాదు

Oct 8 2024 2:04 PM | Updated on Oct 8 2024 2:43 PM

Unexplained Slowdown: Congress Complains To Poll Body On Haryana Results

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కు అంచనాలు మారుతున్నాయి. హర్యానాలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందంటూ అన్నీ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయగా.. ఫలితాలు అందుకు విరుద్దంగా వెలువడుతున్నాయి. ఫలితాల్లో తొలుత  కాంగ్రెస్ దూసుకెళ్లగా తరువాత ఢీలా పడింది. అతితక్కువ స్థానాల్లో లీడ్‌లో ఉన్న బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. ఉత్కంఠ భరితంగా సాగుతున్న పోరులో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తుంది.

అయతే తమదే గెలుపు అంటూ ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు హర్యానా ఫలితాలు షాక్‌ను ఇవ్వడంతో.. ఎన్నికల ఫలితాలు వెల్లడించడంలో ఆలస్యం జరుగుతోందంటూ హస్తం పార్టీ మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉదయం 9 మరియు 11 గంటల మధ్య ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాల అప్‌డేట్‌ లేదని, మందకొడిగా సాగుతోందని  లేఖలో పేర్కొంది.

మీడియాలో వస్తోన్న ఫలితాల సరళితో పోల్చినప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ ఆలస్యంగా ఉంటుందని తెలిపింది. వెబ్‌సైట్‌ను వాస్తవమైన, ఖచ్చితమైన గణాంకాలతో అప్‌డేట్ చేయాలంటూ తమ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఈసీని కోరింది. దీనివల్ల హానికరమైన తప్పుడు వార్తలను నివారించవచ్చని తెలిపింది.

మరోవైపు ఈసీ వెబ్‌సైట్‌ అప్‌డేట్‌లో జాప్యంపై కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ విమర్శలు గుప్పించారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమయంలో మాదిరిగానే.. హర్యానా కౌంటింగ్  ఫలితాల సరళిని కూడా ఎప్పటికప్పుడు ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయడంలో జాప్యం కనిపిస్తోంది. కాలం చెల్లిన, తప్పుదోవ పట్టించే ట్రెండ్స్‌ను షేర్ చేస్తూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోందా..?ఈ అంశంపై ఇసికి ఫిర్యాదు చేశాం.  మా ప్రశ్నలకు ఈసీ సమాధానమిస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement