ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారు  | Sakshi
Sakshi News home page

ఆలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారు 

Published Tue, May 31 2022 3:29 AM

Telangana MLA Jagga Reddy Fires On BJP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మసీదులు తవ్వితే శివలింగాలు వచ్చే విషయం పక్కన పెట్టండి. భూమిలోపల తవ్వకాలు అటుంచి భూమిపై ఉన్న శివాలయాల అభివృద్ధికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చి రాష్ట్రంలో ఎన్ని పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ చేశారో చెప్పండి’ అని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ప్రశ్నించారు.

సోమ వారం ఆయన గాంధీభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ తో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దేవాలయాల వివరాలన్నింటినీ సేకరించి బీజేపీ ఆఫీసు ముందు కూర్చుంటానని, నిజంగా బీజేపీ నేతలు భగవంతుని భక్తులే అయితే ఆ దేవాలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులిప్పించాలని కోరారు. మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హితవు పలికారు. సంజయ్‌ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటేపై ఆయనపై సీఎం కేసీఆర్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement