బీఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..! | Surveillance of engineers who are in touch with BRS | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌కు టచ్‌లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..!

Jun 22 2025 1:23 AM | Updated on Jun 22 2025 6:02 AM

Surveillance of engineers who are in touch with BRS

బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలకు సమాచారం ఇస్తున్నారని అనుమానం 

నిఘా విభాగం నివేదించడంతో సర్కారు చర్యలు.. ఏసీబీ దాడులు, విజిలెన్స్‌ షోకాజ్‌ నోటీసులతో హడల్‌ 

తమ నేతలే టార్గెట్‌గా ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారన్న బీఆర్‌ఎస్‌ వర్గాలు  

సాక్షి, హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్‌లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టా లని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. 

బీఆర్‌ఎస్‌ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. 

అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్‌ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుపడుతున్న ఇంజనీర్లు వందల కోట్ల మేర అక్రమ ఆస్తులను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. 

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీనితో ఆ పార్టీ ముఖ్యనేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. 

దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)తో దాడులు జరిపించడంతోపాటు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్‌ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్‌ నోటీసులు జారీకావడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది.  

సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ... 
ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్‌ ఈఎన్‌సీతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రెండు హోదాల్లో కీలకంగా కొనసాగిన బి.హరిరామ్‌ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్‌ 26న అరెస్టు చేసింది. 

అలాగే, వేరే చోటికి బదిలీ చేసినా ఏడాదికాలంగా ఎస్సారెస్పీ డివిజన్‌–8 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా కొనసాగుతున్న నూనె శ్రీధర్‌ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్‌ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారినా బీఆర్‌ఎస్‌ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. 

సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుండగా, కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమరి్థస్తూ రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్‌ అయినట్టు సమాచారం.   

నివేదిక రెండు నెలలు కోల్డ్‌ స్టోరేజీలో.. 
కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌ రావును విచారించింది. వీరిని కమిషన్‌ ప్రశ్నించనున్నట్లు సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

మేడిగడ్డ బరాజ్‌ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్‌ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. రెండు నెలల పాటు కోల్డ్‌ స్టోరేజీలో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్‌ విచారణ కమిషన్‌ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్‌ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్‌ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 2న విజిలెన్స్‌ కమిషన్‌ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్‌ చేసినట్టు గుర్తు చేస్తున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement