సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ | Supreme Court has granted interim bail to Delhi chief minister Arvind Kejriwal in the Delhi excise policy case | Sakshi
Sakshi News home page

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌

Jul 12 2024 10:51 AM | Updated on Jul 12 2024 1:38 PM

Supreme Court has granted interim bail to Delhi chief minister Arvind Kejriwal in the Delhi excise policy case

న్యూఢిల్లీ,సాక్షి: ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. సుప్రీం కోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. 

తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు  జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర  బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అనేక అంశాలపై తదుపరి విచారణ కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడంతో ఆయన ఇంకా జ్యుడిషియల్‌ కస్టడీలో జైల్లోనే ఉండనున్నారు.   

ఈ సందర్భంగా పలు  ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్‌ అరెస్టుకు తగిన కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పటికే 90 రోజులపాటు కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం. సీఎం పదవికి రాజీనామా చేయాలా లేదా అన్నది ఆయన (కేజ్రీవాల్) నిర్ణయానికే వదిలేస్తున్నాం అని వ్యాఖ్యానించింది. 

కాగా, ప్రస్తుతం ఈడీ కేసులో సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్‌ దక్కినా..ఇటీవల కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసింది. సీబీఐ కేసు పెండింగ్‌లో ఉన్నందున ఆయన జ్యుడిషయల్‌ కస్టడీ నిమిత్తం జైల్లోనే ఉండనున్నారు. ఈనెల 17న సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఈడీ అరెస్ట్‌ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ మార్చి 21న ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఈ అరెస్ట్‌ అక్రమమని ఈడీని సవాల్‌ చేస్తూ ఏప్రిల్‌ 9న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడాన్ని సమర్ధించింది. అందులో ఎలాంటి చట్టవిరుద్దం లేదని, కేసు నిమిత్తం దర్యాప్తుకు రావాలని కోరుతూ పదే పదే జారీ చేసిన సమన్లపై స్పందించ లేదు కాబట్టే అరెస్ట్‌ చేయాల్సి వచ్చిందని సమర్దించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.  

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీం కోర్టు ఈడీ స్పందన కోరింది. విచారణ సందర్భంగా,మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత, అతనికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువడిన తర్వాత,కేజ్రీవాల్ అరెస్టుకు ముందు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాలని, సంబంధిత ఫైళ్లను సమర్పించాలని ఈడీకి సూచించింది.ఈ పిటిషన్‌పై తీర్పును జస్టిస్ సంజీవ్ ఖన్నా,దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తీర్పును మే 17న రిజర్వ్ చేసింది. రిజర్వ్‌ చేసిన తీర్పులు ఇవాళ వెలువరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement