రెండోసారి పవర్‌.. ఈటలపై నజర్‌! | Story On Etela Rajender land Grabbing Case | Sakshi
Sakshi News home page

రెండోసారి పవర్‌.. ఈటలపై నజర్‌!

May 2 2021 3:29 PM | Updated on May 2 2021 3:39 PM

Story On Etela Rajender land Grabbing Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యమంలోనూ, తెలంగాణ తొలిమంత్రివర్గంలోనూ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు సన్నిహితంగా మెలిగిన మంత్రి ఈటల రాజేందర్‌కు రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలో ఎదురుచూపులు, ఎదురుదెబ్బలు తప్పడంలేదు. కేబినెట్‌లో బెర్త్‌ కోసం ఆయన నాలుగు నెలలు వెచి ఉండాల్సి వచి్చంది. సీఎంతోపాటు మంత్రిపదవి చేపట్టే అరడజను మందిలో తన పేరు లేకపోవడం, మంత్రివర్గ విస్తరణ సందర్భంగా చివరి నిముషం వరకు తనకు చోటు దక్కకపోవడం, నేరుగా సీఎం నుంచి ఫోన్‌ రాకపోవడం తన ఆత్మాభిమానానికి దెబ్బగా భావించారు.  

దుమారంలేపిన ‘ఓనర్లు’ 
కేబినెట్‌లో రెవెన్యూ సంస్కరణలపై చర్చించిన విషయాలను ఈటల కొందరు రెవెన్యూ సంఘం నాయకులకు లీక్‌ చేశారంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ రాజ్యసభ సభ్యుడే ఈ తరహా వార్తలు రాయించారని ఈటల శిబిరం ఆరోపించింది. 2019 సెప్టెంబర్‌లో జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం.. నాకు మంత్రి పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదు.. అది నా హక్కు’అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయనే ప్రచారం కూడా బలంగా తెరమీదకు వచ్చినా ఎప్పుడూ వివరణలు ఇవ్వలేదు. ‘‘కళ్యాణలక్క్క్ష్మి, పెన్షన్లు, రేషన్‌కార్డులు పేదరికాన్ని నిర్మూలించలేవు’అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం కలిగించాయి. పార్టీ, సీఎం పనితీరుపైనా పలు సందర్భాల్లో ఈటల చేసిన మర్మ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

గంగులకు ప్రాధాన్యతపై అసంతృప్తి 
తనను ఓడించేందుకు సొంత పార్టీ నేతలు కుట్ర చేశారనే వ్యాఖ్యలు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ మంత్రిని ఉద్దేశించి అన్నారని ప్రచారం జరిగింది. మరోవైపు తనను తగ్గించేందుకే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనలో ఈటల ఉన్నట్లు సమాచారం. ఇటీవలి జరిగిన పట్టభద్రుల ఎన్నికలో గంగులకు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇవ్వడం వెనుకా ఇదే కోణం ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈటలకు చెక్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ కొంతకాలంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌ సమాచారాన్ని ఈటలకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఓ ప్రజా సంబంధాల అ«ధికారికి ఉద్వాసన పలికినట్లు తెలిసింది. ఈటల ఆర్థిక కార్యకలాపాలపై సీఎం దృష్టి సారించిన నేపథ్యంలో, అసైన్డ్‌ భూముల కబ్జా వ్యవహారం తెరపైకి రావడంతో కేసీఆర్‌ చకచకా పావులు కదిపినట్లు కనిపిస్తోంది. సీఎంతో సుదీర్ఘకాలంగా రాజకీయ అనుబంధం ఉన్న మెదక్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈటలపై పిర్యాదు అంశం నడిచినట్లు తెలిసింది.

చదవండి: కబ్జా ఆరోపణలు.. ఈటలకు ఎసరు!

Advertisement
 
Advertisement
Advertisement