ఎంపీల సస్పెన్షన్: బరిలోకి పవార్‌ | Sakshi
Sakshi News home page

ఎంపీల సస్పెన్షన్: బరిలోకి పవార్‌

Published Tue, Sep 22 2020 2:36 PM

Sharad Pawar: Never Seen Bills Passed Like This - Sakshi

న్యూఢిల్లీ : రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ అడ్డుకున్న 8 మంది విపక్ష ఎంపీలపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం వారంతా పార్ల‌మెంట్‌ ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ సింగ్ పార్లమెంటు ఆవరణంలో సస్పెండ్ చేసిన 8 మంది ఎంపీలకు టీ, స్నాక్స్ ఏర్పాటు చేశారు. అయితే ఇందుకు విపక్షాలు నిరాకరించడంతో పాటు మీడియా ముందు కావాలని ఇలా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాగా సస్పెండ్‌ అయిన 8 మంది సభ్యులకుఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవర్‌ సంఘీభావం తెలిపారు. వారికి మద్దతుగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగానే ఓ రోజు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం శరద్‌ పవర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులపై రాజ్యసభలో మరింత చర్చ జరగాల్సి ఉందని అన్నారు. ఈ బిల్లుకు సంబంధించి సభ్యులకు ప్రశ్నలు ఉన్నాయని, ఇప్పటి వరకు జరిగిన దానిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం దీనిపై చర్చను కోరుకోవడం లేదనిపిస్తుందన్నారు. సభ సభ్యులకు స్పందన రాలేని సమయంలో ఉపసభాపతి పోడియం వద్దకు వచ్చారని, బిల్లును ఆమోదించడానికి సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. దానిపై చర్చ జరగాలని, కానీ ఇలా ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్న క్రమంలో ఆదివారం రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభలో ఆమోదించడంపై అభ్యంతంర వ్యక్తం చేస్తున్నానారన్నారు.

బిల్లులు ఇలా ఆమోదం పొందడం తానెప్పుడూ చూడలేదని పవార్‌ పేర్కొన్నారు. కేవలం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకే వారిని బహిష్కరించారని, సభ్యుల హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేశారన్నారు. వైస్ చైర్మన్ నిబంధనలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. విపక్షాలు నిరసన చేస్తున్న క్రమంలో వైస్ చైర్మన్ వచ్చి టీ, స్నాక్స్ అందించడం బాలేదని, వ్యవసాయ బిల్లులకు నిరసన తెలిపే సభ్యులకు సంఘీభావంగా తాను ఈ రోజు ఏమీ తినను అని పేర్కొన్నారు. కాగా విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులు ఆదివారం రాజ్యసభ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తనతో అసభ్యంగా ప్రవర్తించి వేటుకు గురైన 8 మంది ఎంపీల కోసం హరివంష్ టీ, స్నాక్స్ తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. 

Advertisement
Advertisement