ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం: వైఎస్‌ జగన్‌ | Save Democracy In AP Tweets YS Jagan About Delhi Dharna | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం: వైఎస్‌ జగన్‌

Jul 19 2024 7:56 PM | Updated on Jul 19 2024 8:32 PM

Save Democracy In AP Tweets YS Jagan About Delhi Dharna

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తోందని, దానిని వైఎస్సార్‌సీపీ అడ్డుకుని తీరుతుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వినుకొండలో వైఎస్సార్‌సీపీ యువకార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. తన ఎక్స్‌ ఖాతాలో ఆయన ఒక సందేశం ఉంచారు.

ఈ నెల 24వ తేదీ బుధవారం న్యూఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేపడతాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గత 45 రోజుల్లో రాష్ట్రంలో అరాచకాలే రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా అని స్పష్టం చేశారాయన. 


అసెంబ్లీలో కూడా నిలదీస్తాం
అలాగే.. చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం అని తెలుగులో మరో ట్వీట్‌ చేశారు. 

 

ఆ తల్లిదండ్రులకు సమాధానమేది?

మరోవైపు.. రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించిన విషయాన్ని ఎక్స్‌ వేదికగా ఆయన తెలియజేశారు. ‘‘పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో క్రూరమైన హత్యకు గురైన రషీద్‌ కుటుంబాన్ని పరామర్శించాను.రాజకీయ కక్షలతో తన కొడుకును పొట్టనబెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ్యాప్యంలో తోడుగా నిలవాల్సిన కొడుకు దారుణ హత్యకు గురికావడం వారిని మరింత కుంగదీసింది.ఆ తల్లిదండ్రుల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆటవిక పాలనకు బలైన ఆ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తుంది.రాష్ట్రంలో ఆట‌విక పాల‌న సాగుతోంద‌డ‌న‌డానికి ర‌షీద్ హ‌త్యే ఒక ఉదాహ‌ర‌ణ‌. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 45 రోజుల్లో 36 రాజ‌కీయ హ‌త్య‌లు జ‌రిగాయి. టీడీపీ వాళ్ల వేధింపులు భ‌రించ‌లేక 37 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. 300 మందికి పైగా హ‌త్యాయ‌త్నాలు జ‌రిగాయి అని ట్వీట్‌ చేశారాయన.

Advertisement
 
Advertisement
Advertisement