
సాక్షి,తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మాజీ మంత్రి సాకే శైలజానాధ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వయసుకు తగ్గట్లు మాట్లాడాలని హితువు పలికారు. వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బుచ్చయ్య చౌదరి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.జగన్ తల నరికితే తప్పేంటి అంటారా..?. బుచ్చయ్య చౌదరి వయస్సు తగ్గట్లుగా నడుచుకోవాలి. 77 ఏళ్లు వచ్చినా ఇంకా ఏదో ఆశించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు మెప్పు కోసం తాపత్రయం పడుతున్నారు. జగన్ పేరు వింటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్లకార్డులో పుష్ప సినిమా డైలాగులు రాసినా కేసు పెట్టారు. టీడీపీ కుట్రలకు వారి పార్టీ కార్యకర్త రవితేజ బలయ్యాడు.రవితేజ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న సభ్యుడు. వాళ్ళ కుటుంబం మొత్తం టీడీపీలోనే ఉన్నారు.రవితేజకు ఆ ప్లకార్డు ఇచ్చి పంపింది టీడీపీనే.
దానికి టీడీపీ మంత్రి రామానాయుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.ఈ కుట్ర మొత్తం టీడీపీ ఆఫీస్లోనే జరిగింది. సినిమాలో డైలాగ్లను పట్టించుకోవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. జగన్ పేరు వింటేనే టీడీపీకి భయం వేస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్కు రక్షణ లేదు. ప్రతిపక్షాన్ని.. జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడారు. మీ భాషను మీ వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది. నారా లోకేష్ కడ్రాయర్లతో పరిగెత్తిస్తామన్నారు. డిప్యూటీ సీఎం ఊగిపోతూ అనేక మాటలు మాట్లాడారు. మీరు పరమార్శలకు వెళ్తే మేం వద్దన్నమా..?

జగన్ పట్ల కుట్రలు జరుగుతున్నాయేమో అన్న అనుమానాలున్నాయి. అందులో భాగంగానే జగన్ భద్రతను కూడా తగ్గించారు. జగన్ లేకుంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లు కూడా ఉండరని భావిస్తున్నారా..?.కుప్పంలో అప్పు కట్టలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేస్తే.. ఐదు లక్షలు ఇచ్చి పాపం కడిగేసుకుంటారా?. ప్రకాశం జిల్లాలో మీ నేత వీరయ్య చౌదరిని హత్య చేసింది మీ వాళ్లు కాదా?.రాజకీయాల్లో హింసాత్మక ప్రవృత్తిని పెంచి పోషిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఓడినా.. మీరు ఎంత హేళన చేస్తున్నా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది ఒక్క జగన్ మాత్రమే. భూస్థాపితం చేస్తా అని చంద్రబాబు మాట్లాడితే తప్పులేదా..?’అని ప్రశ్నించారు.