గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు

Sajjala Ramakrishna Reddy Comments On Tribal welfare - Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తొలి ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రవిబాబు

సాక్షి, అమరావతి: గిరిజనులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థితిలో నిలిపేందుకు, గిరిజనుల ప్రత్యేక సంస్కృతిని, హక్కుల్ని కాపాడటానికి సీఎం జగన్‌ ఎన్నో చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించేందుకు ఎస్టీ కమిషన్‌ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2024 నాటికి తాము వెనుకబడి ఉన్నామని గిరిజనులు అనుకోకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎక్కువ మందికి ఎక్కువ సంక్షేమం, ఎక్కువ మందికి ఎక్కువ ప్రయోజనం కల్పించడం కోసం సీఎం పనిచేస్తున్నారన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం, మహిళలకు 50 శాతం పదవులిచ్చే సంప్రదాయాన్ని వైఎస్సార్‌సీపీ నిబంధనావళిగా చేశారని, ఇటీవల జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లోనూ అదే సూత్రం ప్రాతిపదికన పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. దేశంలో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఎస్టీ కమిషన్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి దానికి తొలి చైర్మన్‌గా కుంభా రవిబాబును సీఎం నియమించారని తెలిపారు. డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రజత్‌ భార్గవ, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంతకుముందు ఎస్టీ కమిషన్‌ కార్యాలయంలో కుంభా రవిబాబు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top